ఈ ఏడాది నవంబర్ 5వ తేదీన అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరుగబోతున్నాయి. వాటిలో భారత్ సంతతికి చెందిన ప్రస్తుత ఉపాధ్యక్షురాలు కమలా హారిస్, మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పోటీ పడుతున్నారు. మొదట బైడెన్ అభ్యర్ధిగా ఉన్నప్పుడు ట్రంప్ దూసుకుపోగలిగారు.
కానీ ఆయన తప్పుకొని ‘కమలాన్ని’ ముందుకు తీసుకువచ్చినప్పటికీ ట్రంప్ ఎదురీదుతున్నారు. తాజా ప్రజాభిప్రాయం ప్రకారం ఆమె లీడింగ్లో ఉన్నారు.
కనుక ‘ట్రంప్ కార్డ్’ ప్రయోగించక తప్పలేదు. మిచిగాన్ ఎన్నికల ప్రచార సభలో డొనాల్డ్ ట్రంప్ మాట్లాడుతూ త్వరలో తాను భారత్ ప్రధాని నరేంద్రమోడీని కలుస్తానని చెప్పారు.
అమెరికాలో స్థిరపడిన లక్షలమంది భారత్ ఓటర్లు ఈ ఎన్నికలలో చాలా కీలకం. కనుక వారిని ఆకట్టుకునేందుకు ట్రంప్, కమలా హారిస్ ప్రయత్నించడం సహజం.
గత (2021)ఎన్నికలకు ముందు అధ్యక్ష హోదాలో ట్రంప్ భారత్ వచ్చి ప్రధాని నరేంద్రమోడీతో కలిసి అహ్మబాదాబాద్లోని నమో స్టేడియంలో సుమారు లక్షమందితో భారీ బహిరంగ సభ నిర్వహించారు. ఆ తర్వాత మోడీ అమెరికా వెళ్ళినప్పుడు కూడా ట్రంప్కి మద్దతు తెలిపారు. కానీ ఆ ఎన్నికలలో ట్రంప్ ఓడిపోయారు.
గత ఎన్నికలలో ట్రంప్కి మద్దతు తెలిపిన ప్రధాని నరేంద్రమోడీ ఈసారి కూడా ఆయనకే మద్దతు తెలుపుతారా? అంటే బహుశః అందుకే మోడీ అమెరికా పర్యటన పెట్టుకొని ఉండవచ్చు. ఆ నమ్మకంతోనే ట్రంప్ మోడీని కలుస్తానని చెప్పి ఉండవచ్చు.
కానీ ఈసారి భారత్ మూలాలు కలిగిన కమలా హారిస్ అమెరికా అధ్యక్షురాలు అయితే ఆమె వలన భారత్కు, ముఖ్యంగా అమెరికాలో భారతీయులకు ఎంతో కొంత మేలు కలుగుతుంది కదా?
ముఖ్యంగా కమలా హారిస్ విజయావకాశాలు ఎక్కువగా ఉన్నప్పుడు, ప్రధాని నరేంద్రమోడీ ఆమెకు బదులు ట్రంప్కి మద్దతు ఇవ్వడం వలన భారత్-అమెరికా సంబంధాలు బలపరుచుకునే ఓ గొప్ప అవకాశాన్ని చేజార్చుకున్నట్లవుతుంది కదా?
కనుక ప్రధాని నరేంద్రమోడీ భారత్కు, ముఖ్యంగా అమెరికాలో స్థిరపడిన భారతీయులకు మేలు కలిగించే నిర్ణయం తీసుకుంటారని ఆశిద్దాం.




