సిఎం చంద్రబాబు నాయుడుకి జెడ్ క్యాటగిరీ భద్రత ఉంది. చుట్టూ అనేకమంది కమెండోలు ఆయనకు రక్షణగా ఉంటారు. అయితే ఆయన చుట్టూ పెద్ద పెద్ద తుపాకీలు పట్టుకొని రక్షణగా ఉంటే సరిపోతుందా?
ముఖ్యమంత్రి వరద ముంపు ప్రాంతాలలో పర్యటించేటప్పుడు ఆయనకు ఏమైనా ప్రమాదం పొంచి ఉందా లేదా?ఎటువంటి ప్రమాదాలు సంభవించే అవకాశం ఉంది?అని ముందుగానే ఆలోచించి తగు ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోలేనప్పుడు జెడ్ కేటగిరీ భద్రత ఉండి ఏం ప్రయోజనం?
సిఎం చంద్రబాబు నాయుడు బుడమేరు నీటి మట్టం, ఉదృతిని స్వయంగా పరిశీలించేందుకు గురువారం దేవీనగర్ వద్ద గల రైల్వే బ్రిడ్జిపైకి వెళ్ళారు. కొద్దిసేపటికి ఓ వైపు నుంచి ప్యాసింజర్ రైలు దూసుకువచ్చింది. దానిని ముందే చూసిన కమెండోలు ఆయనని వెంటనే రైల్వే ట్రాక్ పక్కన ఉండే చిన్న ర్యాంప్ మీదకి మళ్ళించారు.
ఆ సమయంలో ఆయనతో పాటు ఎన్ఎస్జీ కమెండోలు, అధికారులు అందరూ కలిపి సుమారు వందమందికి పైగా ఉన్నారు. అందరూ ఆ ర్యాంప్ మీదే నిలబడి ప్రాణాలు కాపాడుకున్నారు. వారికి కేవలం మూడడుగుల దూరంలో వేగంగా దూసుకుపోయింది. రైలు వెళ్ళేవరకు అందరూ కదలకుండా రెయిలింగ్ పట్టుకొని నిలబడ్డారు.
ఒకవేళ ఆ చిన్న ర్యాంప్ కూడా లేకపోయి ఉండి ఉంటే ఏమయ్యేది? ప్రాణాలు కాపాడుకునేందుకు సిఎం చంద్రబాబు నాయుడుతో సహా అందరూ ఉదృతంగా ప్రవహిస్తున్న బుడమేరులో దూకాల్సి వచ్చేది కదా?ఇది భద్రతా వైఫల్యమే కదా?
జెడ్ కేటగిరీ భద్రత కలిగిన ముఖ్యమంత్రి రైల్వే బ్రిడ్జిపైకి వెళుతున్నప్పుడు, ముందుగా రెండు వైపులా రైల్వేస్టేషన్లకు సమాచారం అందించి వంతెనపైకి రైళ్ళు రాకుండా ఆపాలి. ఒకవేళ అది సాధ్యం కాదనుకుంటే ఆయనకు పరిస్థితి వివరించి రైల్వే బ్రిడ్జిపైకి వెళ్ళడం ప్రమాదమని వారించి ఉండాలి. అదీ చేయలేదని అర్దమవుతోంది.
ఆయన రైల్వే బ్రిడ్జిపై ఉండగా రైలు వస్తే ప్రమాదం జరుగకుండా ఏం చేయాలనే ఆలోచన చేసి ఉండాలి. అత్యవసర పరిస్థితిలో ఆయనని కాపాడేందుకు బ్రిడ్జి కింద బోట్లు, గజ ఈత గాళ్ళతో ఎన్ఎస్జీ కమెండోలు సిద్దంగా ఉండాలి.
కానీ ఎటువంటి ఆలోచన చేయకుండా, ముందస్తు జాగ్రత్తలు తీసుకోకుండా ఎన్ఎస్జీ కమెండోలు పెద్ద పెద్ద తుపాకీలు పట్టుకొని ఆయన వెంట రైల్వేబ్రిడ్జిపైకి వెళ్ళారు. ఇటువంటి ప్రమాద పరిస్థితిలో ఆ తుపాకీలతో ముఖ్యమంత్రిని వారు కాపాడగలరా?ఇది భద్రతా వైఫల్యం కాదా?
ప్రధాని నరేంద్రమోడీ ఎక్కడికైనా పర్యటనకు బయలుదేరితే రెండు మూడు రోజుల ముందుగా ఆయన భద్రతా సిబ్బంది ఆ ప్రాంతానికి చేరుకొని క్షుణ్ణంగా తనికీలు చేసి ఆయనకు ఎటువంటి ప్రమాదం లేదని నిర్ధారించుకుంటారు.
ఇది వరకు జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పర్యటనలకు బయలుదేరితే, దారి పొడవునా పరదాలు కట్టించుకొని ఆ ప్రాంతంలో పచ్చటి చెట్లన్నీ నరికించేసేవారు.
ప్రధాని, ముఖ్యమంత్రుల పర్యటనలలో ఇంత ముందస్తు జాగ్రత్తలు తీసుకునే భద్రత సిబ్బంది నిన్న సిఎం చంద్రబాబు నాయుడు రైల్వే బ్రిడ్జిపైకి వెళుతున్నప్పుడు ఏం జాగ్రత్తలు తీసుకున్నారు? ఇది భద్రతా వైఫల్యం కాదా?కనీసం ఇకపై ఇటువంటివి పునరావృతం కాకుండా తగిన చర్యలు తీసుకుంటే మంచిది.
Video: CM చంద్రబాబు నాయుడు కు తృటిలో తప్పిన రైలు ప్రమాదం
వీడియో చూస్తే పక్కన తప్పుకోవడానికి ప్లేస్ లేదు#ChandrababuNaidu pic.twitter.com/9uhSAWoW9s
— M9 NEWS (@M9News_) September 5, 2024




