పేదల కోసం ప్రభుత్వం ఇళ్ళు నిర్మించాలనుకోవడం మంచిదే కానీ వాటి కోసం ప్రకృతిని, పర్యావరణాన్ని నాశనం చేస్తే ఎవరైనా తప్పు పడతారు. కాకినాడలో ఇళ్ళకు ప్రభుత్వ స్థలాలు లేకపోవడంతో పోర్టుకి చెందిన 116 ఎకరాలను ప్రభుత్వం స్వాధీనం చేసుకొంది. దానిలో 58 ఏకరాలలో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన మడ అడవులు కూడా ఉన్నాయి. కాకినాడ సముద్రతీరంలో ఉన్న ఆ అడవులు సముద్రం ఆటుపోటుల నుంచి అనేక గ్రామాలను కాపాడుతున్నాయి. కనుక ఇది వరకు ఏ ప్రభుత్వమూ కూడా వాటి జోలికి వెళ్లలేదు. కానీ జగన్ ప్రభుత్వం దృష్టి వాటిపై పడింది. అంతే 58 ఏకరాలలో దట్టంగా పెరిగి ఉన్న మడ అడవులను నరికివేసింది. అధికారులు వారించినా వినలేదు పైగా వారి చేతే తప్పుడు నివేదికలు తయారు చేయించి గ్రీన్ ట్రిబ్యూనల్కి సమర్పించింది. అసలు అక్కడ మడ అడవులే లేవని అటవీశాఖ అధికారులతో తప్పుడు నివేదిక తయారు చేయించింది.
జనసేన నాయకులు బొలిశెట్టి సత్యనారాయణ, పాల్ ఇద్దరూ గ్రీన్ ట్రిబ్యూనల్కి ఫిర్యాదు చేయడంతో గత రెండేళ్ళుగా చెన్నైలోని నేషనల్ గ్రీన్ ట్రిబ్యూనల్ (ఎన్జీటీ) పలుమార్లు విచారణ జరిగింది. ఇరు పక్షాల వాదనలు, సమర్పించిన సాక్ష్యాధారాలు అన్నిటినీ పరిశీలించిన తర్వాత ఎన్జీటీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రకృతిని, పర్యావరణాన్ని కాపాడవలసిన ప్రభుత్వమే దానిని నాశనం చేయడాన్ని ఎన్జీటీ తప్పు పట్టింది. మడ అడవులను ధ్వంసం చేసినందుకుగాను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఎన్జీటీ రూ.5 కోట్లు జరిమానా విధించింది. ప్రభుత్వం నుంచి ఈ జరిమానా సొమ్మును ఏపీ కోస్టల్ జోన్ మేనేజిమెంట్ వసూలు చేసి మళ్ళీ అక్కడ మడ అడవులు పెంచేందుకు తగిన చర్యలు చేపట్టాలని ఎన్జీటీ ఆదేశించింది. సెప్టెంబర్ 28వ తేదీన వెలువడిన ఈ తీర్పు ఇప్పుడు ఆన్లైన్లో పెట్టడంతో ఈ విషయం బయటకి పొక్కింది.
ఈ విధ్వంసంపై మరింత లోతుగా అధ్యయనం చేసేందుకు ఇప్పటికే ఓ కమిటీ పనిచేస్తుండగా, ఆరుగురు సభ్యులతో కూడిన మరో నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది. దాని నివేదిక కాపీలను ఒకటి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి, మరొకటి తమకు ఇవ్వాలని ఆదేశించింది.
అధికారం చేపట్టిన రోజు నుంచి విధ్వంసమే విధానంగా సాగుతున్న వైసీపీ ప్రభుత్వం, విశాఖలో పచ్చటి ఋషికొండపై వేలాది చెట్లను నరికివేసి, కొండను తవ్వేసి మట్టిని తరలిస్తోంది. దానిపై కూడా ఎన్జీటీని, సుప్రీంకోర్టుని తప్పుదోవ పట్టించేందుకు విశ్వప్రయత్నాలు చేస్తోంది. ఇంకా రాష్ట్రంలో ఎన్నిచోట్ల ఇలాంటి విధ్వంసం కొనసాగుతోందో ఎవరు చూశారు?



