ఏ కాలంలోనైన, ఏ దేశం, రాష్ట్రంలోనైనా తమ లక్ష్యాలు సాధించాలని తపించే యువతరం ఉంటుంది. అలాగే వారిలో దారితప్పి జీవితాలు నాశనం చేసుకునేవారూ ఉంటారు.
కానీ ఓ గొప్ప లక్ష్యం సాధించాలని కలలుగని పట్టుదలగా ప్రయత్నిస్తున్నప్పుడు అనూహ్యంగా ఎదురు దెబ్బ తగిలితే? ఓ ప్రభుత్వం లేదా ఓ వ్యవస్థ లేదా కొందరు వ్యక్తుల తప్పిదాలు వలన జరిగే నష్టానికి లక్షలాది మంది యువత నష్టపోవాల్సిందేనా? అంటే కాదనే చెప్తాయి ప్రభుత్వాలు, న్యాయస్థానాలు, చట్టాలు. కానీ వాస్తవం మాత్రం అందుకు భిన్నంగా ఉంటుంది.
మధ్యప్రదేశ్లో మౌగంజ్ జిల్లాకు చెందినా ఆకాంక్ష చతుర్వేది (18) వైద్య విద్య అభ్యసించాలనుకుంది. అందుకోసం నీట్ పరీక్షలకు కోచింగ్ కోసం మహారాష్ట్రలోని నాగ్పూర్కి వచ్చి హాస్టల్లో ఉంటూ కోచింగ్ తీసుకుంది.
ఇటీవల జరిగిన నీట్ పరీక్షలు వ్రాసింది. దానిలో తప్పకుండా ఉత్తీర్నురాలై ఎంబీబీఎస్ కోర్సులో సీటు సంపాదించుకోగలనని నమ్మకంతో ఉండేది.
కానీ నీట్ ప్రశ్నాపత్రాలు లీక్ అవడంతో ఆ పరీక్షలు రద్దైయ్యాయి. దాంతో ఆమె తీవ్ర మనస్తాపం చెంది ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యానుకి ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది.
ఆమె నోట్ బుక్లో సూసైడ్ లెటర్ ఉంది. “నేను పరీక్ష బాగా వ్రాశాను. తప్పకుండా మంచి మార్కులు వస్తాయని ఆశ పడ్డాను. కానీ పరీక్ష రద్దు అయ్యింది. మరోసారి పరీక్ష వ్రాసే ధైర్యం, వ్రాసినా పాస్ అవుతాననే నమ్మకం నాకు లేవు. కనుక అమ్మా, నాన్న నన్ను క్షమించండి,” అని దానిలో వ్రాసింది.
ఆమె చావుకు ఎవరు కారణం? నీట్ అనేది జీవితంలో ఒక పరీక్ష మాత్రమే.. అది కాకపోతే మరొకటి చేసి జీవితంలో రాణించవచ్చనే ఆలోచన చేయకుండా తొందరపాటుతో ఆత్మహత్య చేసుకున్న ఆమెదా తప్పు? నీట్ వంటి అత్యున్నత ప్రవేశ పరీక్షలకి లక్షల మంది విద్యార్ధులు హాజరవుతారని తెలిసి ఉన్నా వాటిని సమర్ధంగా నిర్వహించలేకపోయిన ప్రభుత్వానిది, అధికారులని తప్పు పట్టలా? లేక తప్పనిసరిగా డాక్టర్ అవ్వాలని ఒత్తిడి చేసిన తల్లితండ్రులదా? తప్పు ఎవరిది?




