వైసీపీ మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ చేసిన తాజా వ్యాఖ్యలు ఆయన రాజకీయ భవిష్యత్ పై అనేక ప్రశ్నలను లేవనెత్తుతున్నాయి. తానూ జగన్ ఇచ్చిన అవకాశం తో ఇప్పటికే నెల్లూరులో రెండు సార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి మంత్రి గా మంచి గుర్తింపు పొందానని,
అయితే భవిష్యత్ లో తనకు మరో అవకాశం వస్తుందో రాదు తెలియదని, అసలు ఇక్కడితో తన రాజకీయ ప్రస్తానం ముగిసిపోయే అవకాశం కూడా ఉండొచ్చంటూ అనిల్ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు ఏపీ పొలిటికల్ సర్కిల్స్ లో ముఖ్యంగా వైసీపీ లో అంతర్గతంగా చర్చ కు దారి తీశాయి.
అయితే అసలు అనిల్ కుమార్ యాదవ్ లో ఇంతటి రాజకీయ నైరాశ్యం వెనుక ఉన్న అంత బలమైన కారణం ఏమిటనేది ఇక్కడ ఆసక్తిగా మారింది. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో నీటి పారుదల శాఖ మంత్రిగా బాధ్యతలు తీసుకున్న అనిల్ శాఖ పనుల మీద కన్నా ప్రత్యర్థి పార్టీల నేతల మీదే ఎక్కవగా శ్రద్ద పెట్టారు అనే పేరు సంపాదించారు.
జగన్ తనకిచ్చిన ఈ మంత్రి పదవి అవకాశం ప్రత్యర్థుల మీద విరుచుకుపడడానికే అన్నట్టుగా నాడు టీడీపీ, జనసేన నేతల మీద రెచ్చిపోయారు అనిల్. కట్ చేస్తే 2024 లో కనీసం ఎమ్మెల్యే గా కూడా గెలవలేక రాజకీయంగా స్థానికంగా స్తబ్దుగా ఉండిపోయారు.
అయితే వచ్చే ఏడాది లో జగన్ పాదయాత్ర మొదలుపెట్టగానే ఈ సోకాల్డ్ నాయకులంతా కూడా తిరిగి తమ నోటికి పనికల్పిస్తూ పొలిటికల్ గా యాక్టీవ్ మోడ్ లోకి వస్తారు అనుకున్న పార్టీ క్యాడర్ కి అనిల్ ఒక రకంగా ఉహించని షాక్ ఇచ్చారనే చెప్పాలి.
అనిల్ వ్యాఖ్యలు గమనిస్తే వైసీపీ లో అనిల్ పొలిటికల్ భవిష్యత్ ఇక ముగిసిన అధ్యాయమేనా.? అన్న సందేహం కలుగుతుంది. అలాగే అనిల్ కూడా వైసీపీ మాజీ నేత మాదిరే రాజకీయంగా వాలంటరీ రిటైర్మెంట్ ప్రకటిస్తారా.? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ఇప్పటికే వైఎస్ రాజశేఖర్ రెడ్డి కి అత్యంత సన్నిహితులుగా ఉన్న కోటమరెడ్డి శ్రీధర్ రెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వంటి సీనియర్ నాయకులు వైసీపీ కి గుడ్ బై చెప్పి జగన్ ను కాదని టీడీపీ కండువా కప్పుకున్నారు. ఇప్పుడు తాజగా వైసీపీ గొంతు బలంగా వినిపించే మరో నేత అనిల్ కూడా ఇలా రాజకీయ నైరాశ్యంలోకి వెళ్లడం అంటే నెల్లూరు లో వైసీపీ పార్టీ ఐసీయూ లో వెంటిలేటర్ మీదకు వచ్చినట్టే అవుతుందేమో అంటున్నారు పార్టీ క్యాడర్.





