ఏపీలో జగన్, తెలంగాణలో కేసీఆర్ ఇద్దరూ ఒకేసారి ఆకాశం అంత ఎగిసిపడి, మళ్ళీ ఇద్దరూ ఒకేసారి పాతాళంలోకి పడిపోవడం చాలా ఆశ్చర్యకరమే. తమ ఓటమికి ఇద్దరూ ప్రజలనే నిందిస్తున్నారు.
ఓటమి నుంచి పాఠాలు నేర్చుకొని తప్పులు సరిదిద్దుకుని ముందుకు సాగాల్సిన సమయంలో ఒకరు ఎర్రవెల్లి ఫామ్హౌస్లో మరొకరు బెంగళూరు ప్యాలస్లో విశ్రాంతి తీసుకుంటున్నారు.
జగన్ ప్రజలని చూసి భయపడుతూ పరదాలు చాటున తిరిగేవారు. దారి పొడవునా చెట్లు నరికించేసేవారు. కానీ ప్రజలను చూసి భయపడటం కంటే ఎన్నికలలో ఓడిపోతేనే చాలా ప్రమాదామని గ్రహించిన జగన్, ఎన్నికల ప్రచార సమయంలో పరదాలు పక్కన పెట్టి ప్రజల మద్యకు వెళ్ళి ముద్దులు, ఆశీర్వాదాలు ఇచ్చారు.
ఈ ఒక్క విషయంలో జగన్ కంటే కేసీఆర్ చాలా మేలని చెప్పక తప్పదు. ఆయన ఎప్పుడో ఓసారి ప్రగతి భవన్, ఫామ్హౌస్ నుంచి బయటకు వచ్చినా, చాలా స్వేచ్ఛగా ప్రజల మద్యకు వెళ్ళి మాట్లాడేవారు.
జగన్, కేసీఆర్ ఇద్దరూ ముఖ్యమంత్రులుగా ఉన్నంత కాలం తమ మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ నేతలను ఆమడ దూరంలో పెట్టి సొంత నిర్ణయాలు తీసుకునేవారు. ఇప్పుడు అందరితో మాట్లాడుతున్నా నేటికీ ఇద్దరూ తమ నాయకులను “ఏం కాదు… మరేం పర్వాలేదు…. మళ్ళీ మనమే అధికారంలోకి వస్తామంటూ” మభ్యపెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు.
ఈవిషయంలో కేసీఆర్ కంటే జగన్ కాస్త నయమని చెప్పాలి. కేసీఆర్ తనను కలిసేందుకు వస్తున్న నేతలు, కార్యకర్తలతో మరో రెండు నెలల్లో రాష్ట్ర రాజకీయాలలో పెను మార్పులు జరిగి మళ్ళీ మనమే అధికారంలోకి రాబోతున్నామని చెప్పుకుంటున్నారు. కానీ జగన్ మాత్రం వచ్చే ఎన్నికలలో గెలిచి అధికారంలోకి వస్తామని చెప్పుకుంటున్నారు.
ఎందుకంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని కూలద్రోసేందుకు కేసీఆర్కు ఇంకా అవకాశం కనిపిస్తుండటమే కారణం కాగా, ఏపీలో జగన్ పార్టీకి కేవలం 11 ఎమ్మెల్యేలు మాత్రమే ఉండటం వల్లనే జగన్ అటువంటి ఆలోచనలు చేయకుండా వచ్చే ఎన్నికల వరకు వేచి చూద్దామని చెప్పుకుంటున్నారు.




