నూతన సంవత్సర వేడుకలంటే మెట్రో నగరాల్లో నెల రోజుల ముందే సందడి నెలకొంటుంది. పలు కూడళ్లలో విందు, వినోద కార్యాక్రమాలను సూచిస్తూ పెద్ద ఎత్తున హోర్డింగులు వెలుస్తాయి. పలు రిసార్టులు, స్టార్ హోటళ్లు వేడుకలను పెద్దఎత్తున నిర్వహిస్తున్నామంటూ హడావుడి చేసేవి. ఈ ఏడాది అలాంటి సందడి ఏదీ లేదని అసోచామ్ తెలిపింది. నూతన సంవత్సర సంబరాలను పురస్కరించుకుని అసోచామ్ సామాజిక అభివృద్ధి సంస్థ నిర్వహించిన సర్వేలో పలు అంశాలు వెలుగు చూశాయి.
నోట్ల రద్దు న్యూ ఇయర్ వేడుకలపై ప్రభావం చూపిందని అసోచామ్ నివేదిక స్పష్టం చేసింది. నోట్ల రద్దు కారణంగా ఈ ఏడు స్టార్ హోటళ్లు న్యూ ఇయర్ వేడుకల టిక్కెట్ ధరలు సుమారు 2 నుంచి 3 శాతం వరకు తగ్గించాయని తెలిపింది. ఈ విషయం తాము అహ్మదాబాద్, హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, దిల్లీ, ఇండోర్, జైపూర్, కోల్కతా, లక్నో, ముంబయి సహా దేశ వ్యాప్తంగా మెట్రో నగరాల్లోని పలు స్టార్ హోటళ్లపై చేసిన సర్వేలో వెలుగు చూసిందని అసోచామ్ తెలిపింది.
ఇవి గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది స్టార్ హోటళ్లలో న్యూ ఇయర్ బుకింగ్స్ 5 నుంచి 7 శాతం వరకు పడిపోయాయని చెప్పింది. ధరలు తగ్గించినా, డిస్కౌంట్లు ప్రకటించినా స్టార్ హోటళ్ల న్యూయర్ బుకింగ్స్ కలకళలాడడం లేదని, వెల వెలబోతున్నాయని పేర్కొంది. నోట్ల రద్దు కారణంగానే న్యూ ఇయర్ వేడుకలు అట్టహాసంగా నిర్వహించుకునేందుకు పలువురు వెనుకాడుతున్నారని అసోచామ్ అభిప్రాయపడింది.



