500, 1000 నోట్లను రద్దు చేయడం, గడువు తేదీ విధించడం, అది ముగియడం కూడా జరిగిపోయాయి. అయితే ఫైనల్ ఆప్షన్ గా ఆర్బీఐ కౌంటర్స్ లో సరైన వివరణ ఇస్తే… డిపాజిట్ చేసుకునే అవకాశాలు ఉన్నాయి. ఇంత కఠినమైన నిబంధనల్లోనూ పాత నోట్ల మార్పిడి ఇంకా కొనసాగుతుండడం విశేషం. విశాఖ వేదికగా వెలుగు చూసిన ఈ దందాలో పాత నోట్లు గతంలోనే చేరిపోగా, తాజాగా కొత్త నోట్లతో పోలీసులకు రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడి పోయారు.
విశాఖపట్టణంలోని శంకరమఠం రోడ్డులో రామలింగేశ్వరస్వామి ఆలయం సమీపంలోని పవన్ ఎస్టేట్స్ లోని ఓ ఫ్లాట్ లో నగదు మార్పిడి జరుగుతున్నట్టు సమాచారం అందుకున్న టాస్క్ ఫోర్స్ పోలీసులు, పక్కా ప్రణాళికతో దాడి చేయడంతో ఈ బండారం బట్టబయలైంది. ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్న పోలీసులు, వారి నుంచి ఏకంగా 47 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. ఇందులో 46 లక్షల విలువైన కొత్త 2 వేల నోట్లు ఉన్నాయి.
పోలీసులకు పట్టుబడిన ముగ్గురు నిందితుల్లో ఒకరు వైద్యుడు కాగా, మిగిలిన ఇద్దరు బ్రోకర్లుగా తేలింది. ఇప్పటికే పాత నోట్లను తీసుకున్న వీరు 30 శాతం కమిషన్ తో కొత్త నోట్లు ఇచ్చేందుకు ఒప్పందం చేసుకున్నారు. ఇలా ఇప్పటికే 50 లక్షల వరకు మార్చినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం పట్టుబడిన 46 లక్షల విలువైన కొత్త నోట్లు వీరికి ఎక్కడి నుంచి వచ్చాయన్న దానిపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. బ్యాంకులు, పోస్టాఫీసు సిబ్బంది పాత్రపై విచారణ జరుపుతున్నట్టు ఏసీపీ తెలిపారు.



