రాజకీయ పార్టీలు ఎన్నికలలో గెలిచి అధికారంలోకి వస్తే చాలు.. వాటి గొప్పదనం అమాంతం పెరిగిపోతుంది. అది వాపును చూసి బలుపు అనుకోవడమే.
కానీ ఎన్నికలలో ఓడిపోయి, అధికారం కోల్పోయిన తర్వాత నుంచి అవి ఏవిధంగా నెగ్గుకువస్తున్నాయనే దానిని బట్టి వాటి బలమెంతో స్పష్టమవుతుంది.
ఏపీలో టీడీపి, వైసీపీలు తెలంగాణలో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు గట్టిగా నిలబడి పోరాడుతూ తమ సత్తా చాటుకున్నాయి.
కేసీఆర్ ధాటికి కాంగ్రెస్ పార్టీ, దాని సీనియర్ నేతలు తట్టుకోలేక విలవిలలాడుతున్నప్పుడు రేవంత్ రెడ్డి బాహుబలిలా ప్రవేశించి, కేసీఆర్ని ధైర్యంగా ఎదుర్కొని ఓడించారు. కేసీఆర్ అంతటివాడు రేవంత్ రెడ్డి ధాటిని తట్టుకోలేక రెండున్నరేళ్ళుగా ఫామ్హౌసులో కూర్చున్నారు.
రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆరునెలల్లో కూలిపోతుందని బీఆర్ఎస్ పార్టీ అనుకుంటే రెండున్నరేళ్ళుగా దిగ్విజయంగా సాగిపోతోంది.
వరుస ఓటములతో సతమతమవుతున్న బీఆర్ఎస్ పార్టీ పనైపోయిందని సిఎం రేవంత్ రెడ్డి పదేపదే చెప్తున్నా నేటికీ ప్రతీ ఎన్నికలో అదే కాంగ్రెస్ పార్టీకి గట్టిపోటీ ఇస్తోంది! ఫోన్ ట్యాపింగ్, కాళేశ్వరం, ఎఫ్-1 రేసింగ్ వంటి ఓ అర డజను కేసులు పెట్టినప్పటికీ ఏ ఒక్క కేసులో కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావులను కాంగ్రెస్ ప్రభుత్వం టచ్ చేయలేకపోతోంది.
అంటే కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు బలంగా నిలబడ్డాయని స్పష్టమవుతోంది.
ఏపీలో జగన్ అధికారంలోకి వచ్చి టీడీపిని వేధిస్తున్నప్పుడు అది కూడా ఏమాత్రం నిబ్బరం కోల్పోకుండా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో అలుపెరుగని పోరాటాలు చేస్తూనే ఉంది. ప్రభుత్వం నుంచి అడుగడుగునా ఆటంకాలు ఎదురవుతున్నా నారా లోకేష్ యువగళం పాదయాత్ర దిగ్విజయంగా చేశారు.
టీడీపి నాయకులు కూడా కష్టకాలంలో ప్రజలకు అండగా నిలబడి వారి మన్ననలు పొందారు. పార్టీ కార్యకర్తలు కూడా కేసులు, వేధింపులు, భౌతిక దాడులు భరిస్తూనే పార్టీ చేపట్టిన ప్రతీ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఓ రాజకీయ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏవిధంగా కలిసికట్టుగా పనిచేస్తూ ముందుకు సాగాలో ఆచరణలో చూపించారు.
గతంలో వైసీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వ్యవహరించిన తీరుకి, ప్రస్తుతం వ్యవహరిస్తున్న తీరుకి చాలా తేడా కనిపిస్తోంది. నాడు జగన్ నిత్యం ప్రజల మద్యనే ఉండేవారు. కానీ ఇప్పుడు మూడు ప్యాలస్ల మద్య తిరుగుతూ ప్యాలస్ రాజకీయాలు చేస్తున్నారు. పరామర్శల పేరుతో బల ప్రదర్శనలు చేస్తున్నారు.
ఆ పార్టీ వేసుకున్న ‘మంచి ముసుగు’ క్రమంగా తొలగిపోయి ఫ్యాక్షనిజం, మతతత్వం క్రమంగా బయటపడుతున్నాయి. అయినప్పటికీ వైసీపీ ఏమాత్రం భయపడటం లేదు!. పైగా ఇంకా బలంగా అదే దారిలో దూసుకుపోతోంది.
వైసీపీ ధోరణి వచ్చే ఎన్నికలలో ఆ పార్టీకి తీరని నష్టం కలిగించవచ్చు గాక కానీ ఈ ధోరణితోనే పార్టీ శ్రేణులు చెల్లాచెదురు అయిపోకుండా జగన్ కాపాడుకోగలుగుతున్నరనేది సుస్పష్టం. అంటే ప్రజా సమస్యలపై పోరాడాల్సిన వైసీపీ పార్టీని కాపాడుకోవడానికే ప్రాధాన్యం ఇస్తోందన్న మాట!
వైసీపీ… దాని అధినేత జగన్ ఈ వైఖరి తప్పు కావచ్చు. కానీ ఏదో విధంగా వైసీపీ గట్టిగా నిలబడి పోరాడుతూనే ఉంది కదా? ఇలాంటి క్లిష్ట సమయాలలో ప్రతిపక్షాలు గట్టిగా నిలబడగలిగితే చాలు… తర్వాత ఏమైనా జరుగవచ్చు… అని చరిత్ర చెపుతోంది కదా!




