జగన్ ముఖ్యమంత్రి పదవి కోల్పోగానే డిప్లమెటిక్ పాస్పోర్ట్ రద్దు అవడంతో సాధారణ పాస్పోర్ట్ కోసం దరఖాస్తు చేసుకొని లండన్ వెళ్ళేందుకు సీబీఐ కోర్టు అనుమతి తీసుకున్నారు. అయితే విజయవాడ ప్రత్యేక కోర్టులో జగన్పై మాజీ మంత్రి నారాయణ 2018లో పరువు నష్టం దావా వేశారు.
కనుక ఆ కోర్టు నుంచి ‘నో అబ్జక్షన్ సర్టిఫికేట్’ తెచ్చుకోవాలని హైదరాబాద్ పాస్పోర్ట్ కార్యాలయం సూచించింది. పాస్పోర్ట్ కోసం విజయవాడ కోర్టుని సంప్రదిస్తే, జగన్ స్వయంగా కోర్టుకు వచ్చి రూ.20,000 పూచీకత్తు చెల్లిస్తే, కేవలం ఏడాది పరిమితితో పాస్పోర్ట్ మంజూరు చేస్తామని తేల్చి చెప్పింది.
కానీ జిల్లా కోర్టుకి వెళ్ళి పూచీకత్తు చెల్లించడం నామోషీగా భావించినందునే జగన్ హైకోర్టులో పిటిషన్ వేశారని పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఎం లక్ష్మినారాయణ వాదించారు.
జగన్ పిటిషన్పై నేడు విచారణ జరిపిన హైకోర్టు 5 ఏళ్ళ కాలపరిమితితో పాస్పోర్ట్ మంజూరు చేయాలని హైదరాబాద్లోని పాస్పోర్ట్ కార్యాలయాన్ని ఆదేశించింది. కానీ ప్రజాప్రతినిధుల కోర్టు విధించిన ఆంక్షలు సడలించడానికి అంగీకరించలేదు. కనుక జగన్ రూ.20,000 పూచీకత్తు చెల్లించి పాస్పోర్ట్ తీసుకోక తప్పదు. వద్దనుకుంటే సుప్రీంకోర్టుకి వెళ్ళి మరో లక్షో రెండు లక్షలో ఖర్చు చేసుకునే వెసులుబాటు ఉండనే ఉంది.
జగన్, వైసీపి ఉన్న ప్రస్తుత పరిస్థితులలో హైకోర్టులో పిటిషన్ వేయడమే తప్పు. మాజీ ముఖ్యమంత్రిగా చేసిన జగన్, పాస్పోర్ట్ కోసం హైకోర్టులో న్యాయపోరాటం చేస్తుండటం ఆయనకు, వైసీపికి కూడా గౌరవం కాబోదు. దీని గురించి మీడియా, సోషల్ మీడియాలో వచ్చిన వార్తలు, కామెంట్స్ చూస్తే, విజయవాడ కోర్టులో పూచీకత్తు చెల్లించేసి పాస్పోర్ట్ తీసుకోకుండా, హైకోర్టుకి వెళ్ళడం ఎంత తప్పో అర్దమవుతుంది.
ఇప్పుడు జగన్కి 5 ఏళ్ళకి పాస్పోర్ట్ ఇస్తున్నా దానిని మళ్ళీ 5 ఏళ్ళ తర్వాత తప్పనిసరిగా రెన్యూవల్ చేయించుకోవలసిందే. కనుక ప్రస్తుత పరిస్థితులలో ఒక ఏడాదికి తీసుకున్నా వచ్చే నష్టం ఏమీ ఉండదు. కానీ హైకోర్టుకి వెళ్ళి జగన్ తన పరువు, పార్టీ పరువు కూడా తీసుకున్నారు.
అయితే పాస్పోర్ట్ లేనప్పుడు వరద, బురద రాజకీయాలు చేస్తూ జగన్ సమయాన్ని బాగానే సద్వినియోగం చేసుకున్నారు. అచ్యుతాపురం బాధితులు, విజయవాడ వరద బాధితులను ఓదార్చడం పూర్తయిపోయింది. ఇప్పుడు పాస్పోర్ట్ వచ్చేస్తోంది కనుక జగన్ దంపతులు త్వరలో లండన్ యాత్రకు బయలుదేరవచ్చు. ఇంకెవరైనా ఉంటే లండన్ నుంచి తిరిగి వచ్చాక ఓదార్చుతారు.




