దాదాపుగా ఒక సంవత్సరం క్రితం… సంక్రాంతికి తానూ నిర్మించిన “నాన్నకు ప్రేమతో” సినిమాను భారీ స్థాయిలో విడుదల చేయడానికి నిర్మాత బివిఎస్ఎన్ ప్రసాద్ సన్నాహాలు చేసుకుంటున్నారు. ఈ తరుణంలో సదరు నిర్మాత ప్రసాద్ పై ‘జనసేన’ అధినేత నిర్మాతల మండలిలో చేసిన ఫిర్యాదు సంచలనాత్మకమైంది. బీవీఎస్ఎన్ ప్రసాద్ కు ముచ్చెమటలు పట్టిన ఈ ఉదంతం గురించి తాజాగా స్పందించారు.
‘ఇంట్లో దెయ్యం నాకేం భయం’ సినిమా ప్రమోషన్ లో భాగంగా మీడియా వర్గాలకు ఇంటర్వ్యూ ఇస్తున్న సమయంలో… సదరు సంఘటనపై స్పందిస్తూ… పవన్ కల్యాణ్ కు డబ్బులు ఇవ్వడంలో ఆలస్యం జరిగిన మాట వాస్తవమేనని… కానీ, అలా ఎందుకు జరిగిందో తనకు అర్థం కావడం లేదని చెప్పారు. ఆ సమయంలో తాను అలాంటి పరిస్థితిలో ఉండటం తన దురదృష్టమని తెలిపారు. అయితే, ‘నాన్నకు ప్రేమతో’ సినిమా రిలీజ్ కు ముందు పవన్ కల్యాణ్ ఫిర్యాదు చేయడంతో… తాను చాలా ఇబ్బందులు పడ్డాను గానీ, పవన్ తో ఎలాంటి ఇబ్బందులు పడలేదని స్పష్టం చేసారు.
వాస్తవానికి ‘అత్తారింటికి దారేది’ సినిమా పైరసీ విషయంలో పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ శ్రీనివాస్ ఎంతో సహకరించారని, తానూ గట్టెక్కడానికి కారణం వీరేనని గుర్తు చేసుకున్నారు. అలాంటి పవన్ ఫిర్యాదు చేయడంతో షాక్ కు గురైన మాట వాస్తవమే అయినా, ఇలాంటివి సినీ ఇండస్ట్రీలో సర్వసాధారణం అన్న రీతిలో చాలా తేలికగా తీసుకున్నారు ప్రసాద్. మరికొద్ది గంటల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న తన తాజా చిత్రం ‘ఇంట్లో దెయ్యం నాకేం భయం’ సినిమా అన్ని వర్గాలను అలరించేదిగా ఉంటుందని సదరు నిర్మాత చెప్పుకొచ్చారు.



