దాదాపు ఒక దశాబ్ద కాలం నాటి నుండి ప్రత్యక్ష రాజకీయాల్లో ఉంటూ దాదాపు 60 మంది ఎమ్మెల్యేలు తోడు ఉన్న వైసీపీ అధినేత జగన్ చేసే ప్రసంగాలకు విలువ ఉందో లేదో చెప్పలేం గానీ.., కేవలం రెండున్నర్ర సంవత్సరాల ప్రత్యక్ష రాజకీయ జీవితం మాత్రమే ఉన్న పవన్ కళ్యాణ్ మాటలకు మాత్రం ఒక రేంజ్ వాల్యూ ఉందని ఏకంగా సిఎం చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలే నిలుస్తున్నాయి. అంత పరిపక్వతతో పవన్ ప్రసంగిస్తున్నారు కాబట్టే… మీడియా వర్గాలు విపరీతమైన ఆసక్తిని ప్రదర్శిస్తుంటాయి.
మరి తాజాగా కాకినాడ సభలో ‘జనసేన’ అధినేత ఏం చెప్పబోతున్నారు? తిరుపతి వేదికగా కేంద్ర వైఖరిని తూర్పారపట్టిన పవన్, కాకినాడలో టిడిపిని టార్గెట్ చేస్తారన్న మాటలు తొలుత వినిపించాయి. అయితే, తాజాగా కేంద్రం ప్యాకేజ్ ప్రకటించిన దరిమిలా, ఏ వైఖరితో ప్రజల ముందుకు పవన్ వస్తారు అన్న ఆసక్తి సర్వత్రా నెలకొని ఉంది. దీనిపై చంద్రబాబు కూడా స్పందిస్తూ… ప్యాకేజ్ తర్వాత పవన్ ఎలా స్పందిస్తారో చూద్దాం… ఎవరైనా అభివృద్ధితో కలిసి వస్తే తాము స్వాగతిస్తాం అన్నట్లుగా చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు, ‘పవన్ యొక్క విలువను’ చాటిచెప్తున్నాయి.
మరో పక్కన పవన్ వేడుకకు సర్వం సన్నద్దమవుతోంది. తూర్పు గోదావరి జిల్లా, కాకినాడ జేఎన్టీయూ క్రీడా మైదానంలో జరగనున్న ‘సీమాంధ్రుల ఆత్మగౌరవ సభ’ను ముస్తాబు చేసే బాధ్యతను ‘జనసేన’ కార్యకర్తలు, అభిమానులు తీసుకున్నారు. ఒక్క కాకినాడలోనే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా 13 జిల్లాలలో సభలు, సమావేశాలు నిర్వహిస్తానని పవన్ తిరుపతిలో ప్రకటించిన దరిమిలా… తన భవిష్యత్తు కార్యాచరణపై కాకినాడలో పవన్ ఎలా ప్రకటిస్తారు అనేది ఆసక్తికరంగా మారింది.



