ఏపీలో ఎన్నికలకీ ఇంకా ఏడాదిపైనే సమయం ఉంది కానీ అధికార వైసీపీతో సహా అన్ని పార్టీలు నేడో రేపో ఎన్నికలు జరుగబోతున్నట్లు చాలా హడావుడి చేస్తున్నాయి. వాటిలో జనసేన కూడా ఒకటి. టిడిపితో పొత్తులు ఉంటాయన్నట్లు మొదట సంకేతాలు ఇచ్చిన ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ విశాఖలో ప్రధాని నరేంద్రమోడీతో భేటీ తర్వాత జనసేన ఒంటరిగా పోటీ చేస్తుందన్నట్లు మాట్లాడుతున్నారు. తాను ముఖ్యమంత్రి కాగానే ఫలానా ఫైలుపై తొలిసంతకం చేస్తానని చెపుతున్నారు. బిజెపి ఆయనకి పూర్తి అండగా నిలబడుతుందని టిడిపితో పొత్తుల గురించి ఆలోచించవద్దని బహుశః ప్రధాని నరేంద్రమోడీ చెప్పి ఉండవచ్చు. మంచిదే!
అయితే రాబోయే ఎన్నికలలో టిడిపి, వైసీపీలను ఎదుర్కొని పోరాడగల బలమైన నేతలు జనసేనలో ఉన్నారా అంటే లేరనే అందరికీ తెలుసు. కనుక జనసేన పార్టీలోనే ద్వితీయశ్రేణి నాయకులను తయారుచేసుకోవడమో లేదా నిష్కళంక చరిత్ర కలిగిన విద్యావేత్తలను, మేధావులను, ఐఏఎస్, ఐపీఎస్ అధికారులతో పార్టీని బలోపేతం చేసుకోవవలసిన అవసరం ఉంది. అప్పుడే ఆశయాలు, ఆలోచనలు అమలుచేయగలుగుతుంది. జనసేన ఇతర రాజకీయ పార్టీలకి భిన్నమైనదని ప్రజలు కూడా గుర్తిస్తారు. కానీ టిడిపి, వైసీపీలలో టికెట్స్ లభించవని బయటకి వచ్చేవారికి జనసేన స్వాగతం పలకాలని నిర్ణయించుకొన్నట్లు తెలుస్తోంది.
రాజకీయాలలో ఇది చాలా సహజమే. కానీ వైసీపీ నేతలు అవినీతిపరులని, గూండాల్లా వ్యవహరిస్తున్నారని విమర్శలు చేస్తూ మళ్ళీ వారినే జనసేనలో చేర్చుకొంటే ఆ పార్టీకి వైసీపీకి ఇక తేడా ఏముంటుంది? ఒకవేళ పవన్ కళ్యాణ్ అటువంటివారితో కలిసి వచ్చే ఎన్నికలలో గెలిచి అధికారంలోకి వచ్చినా, వారిని కాదని నీతివంతమైన పాలన అందించగలరని, అమరావతిని నిర్మించగలరని ఎలా అనుకోగలము?కనుక పవన్ కళ్యాణ్ తన పార్టీని వీలైనంత పరిశుభ్రంగా ఉంచుకొంటూ ఎన్నికలలో పోటీ చేయగల సమర్దులైన నాయకులను తయారుచేసుకోవడం చాలా మంచిది.



