‘సర్ధార్ గబ్బర్ సింగ్’తో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు, ‘బ్రహ్మోత్సవం’తో ప్రిన్స్ మహేష్ బాబు అభిమానులు తీవ్ర నిరుత్సాహంలో ఉన్న విషయం తెలిసిందే. దీంతో తమ అభిమాన హీరోల తదుపరి సినిమాలు ఎప్పుడు ప్రారంభమవుతాయోనని ఇరువురి అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. రెండు సినిమాలు ఇప్పటికే షూటింగ్ ప్రారంభం కావాల్సి ఉండగా, పవన్ సినిమాకు దర్శకుడు, స్క్రిప్ట్ పేరుతో, మహేష్ సినిమా హీరోయిన్, స్క్రిప్ట్ వర్క్ పేరుతో వాయిదాలు పడిన విషయం తెలిసిందే.
ఇప్పటివరకు అభిమానులను వేచిచూసేలా చేసిన ఈ ఇద్దరి హీరోలు, ఇప్పుడు ఫ్యాన్స్ కాంక్షలు నెరవేర్చేందుకు సిద్ధమయ్యారు. ఈ రెండు సినిమాలు తమ తమ ప్రీ ప్రొడక్షన్ పనులను దాదాపుగా పూర్తి చేసుకున్నాయి. మహేష్ సినిమా ఈ వారమే సెట్స్ పైకి వెళ్తుండగా, పవన్ సినిమా వచ్చే వారం నుండి సెట్స్ పైకి వెళ్లనుంది. ఈ నెల 29వ తేదీ నుండి మొదటి షెడ్యూల్ ప్రారంభం కానుండగా, షూటింగ్ ను చెన్నై, ముంబై, పూణే, గుజరాత్, హైదరాబాద్ లలో ప్లాన్ చేసారు. చిరంజీవితో ‘స్టాలిన్’ సినిమా తర్వాత మురుగదాస్ తెలుగులో దర్శకత్వం వహిస్తున్న సినిమా కావడంతో, ఇప్పటికే ట్రేడ్ వర్గాల్లో టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది ఈ సినిమా.
ఇక, డాలీ దర్శకత్వంలో తెరకెక్కనున్న పవన్ కళ్యాణ్ సినిమా ఫస్ట్ షెడ్యూల్ ఆగష్టు మొదటి వారం నుండి ప్రారంభం కాబోతోంది. హీరోయిన్ ఎంపికపై చాలా వార్తలు హల్చల్ చేసినప్పటికీ, చివరికి ‘గబ్బర్ సింగ్’ జోడి శ్రుతిహాసన్ వచ్చి చేరింది. ఈ సినిమాను కూడా పవన్ సన్నిహితుడు శరత్ మరార్ నిర్మిస్తున్నారు. ‘సర్ధార్ గబ్బర్ సింగ్’తో భారీ పరాజయాన్ని మూటకట్టుకున్న పవన్ – మరార్ లు, ఈ సారి ఆ లోటును భర్తీ చేయడానికి పూనుకున్నట్లున్నారు. ఈ సినిమా విషయంలో వినపడుతున్న మరో ఆసక్తికర విషయం ఏమిటంటే… శరవేగంగా షూటింగ్ పూర్తి చేసి, ఈ డిసెంబర్ నాటికల్లా సినిమాను విడుదల చేయాలని సంకల్పించారట.



