ట్విట్టర్ ద్వారా భారతీయ జనతా పార్టీపై విమర్శల వర్షం కురిపిస్తోన్న ‘జనసేన’ అధినేత పవన్ కళ్యాణ్, తాజాగా అదే సామాజిక మాధ్యమ వేదికగా తొలిసారిగా ఓ సినిమాపై స్పందించారు. బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తున్న ‘మిస్టర్ పర్ ఫెక్ట్’ అమీర్ ఖాన్ నటించిన “దంగల్” సినిమాపై ప్రశంసలు కురిపించాడు పవన్. బాలీవుడ్ లో తన సత్తా ఏంటో నిరూపించుకున్న అమీర్ ఖాన్ ను, ఈ సినిమా నటీనటులతో పాటు సాంకేతిక నిపుణులను పవన్ కల్యాణ్ కొనియాడారు.
“ఇటీవల తాను దంగల్ సినిమా చూశానని, తన అభిప్రాయాన్ని వ్యక్తీకరించకుండా ఉండలేకపోతున్నానని, అమీర్ ఖాన్ అద్భుతమైన నటనతో ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది హృదయాలను గెలుచుకున్నారని” పవన్ ట్వీట్ చేశారు. అంతేకాదు, అంత గొప్ప నటుడు భారతీయుడు కావటం మనకు గర్వకారణమని, ఈ సినిమాకు పనిచేసిన ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణులకు తన అభినందనలు తెలుపుతున్నట్లు చెప్పారు.
ఈ సినిమా దర్శకుడు నితీష్ తివారీ ఈ సినిమా కథను ఎంతో చక్కగా ప్రేక్షకుడు కథలో లీనమయ్యేలా తీశారని, ఈ సినిమాలో బబితా ఫొగట్‑గా నటించిన సుహానీ భట్నాగర్, సన్యా మల్హోత్రాలకు, గీతా ఫొగట్ పాత్రలో నటించిన జైరా వసీం, ఫాతిమా సనా షేక్ లకు తన ప్రత్యేక అభినందనలు తెలుపుతున్నట్లు చెప్పారు. ఈ చిత్రం స్త్రీ సాధికారత గురించి మనందరినీ మరోసారి ఆలోచించేలా చేసిందని పవన్ పేర్కొన్నారు.



