గత రెండు రోజులుగా విజయవాడలోని వరదలతో ఏపీ అల్లాడుతుంటే వాటి మీద బురద రాజకీయాలు చేస్తూ వైసీపీ పేట్రేగిపోతోంది. స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడే వరద సహాయక కార్యక్రమాలను పర్యవేక్షిస్తూ ఎప్పటికప్పుడు అధికారులకు ఆదేశాలు ఇస్తూ బాధిత ప్రాంతంలోనే ఉంటూ ఆ కుటుంబాలకు నేనున్నాను అనే ధైర్యాన్ని అందిస్తున్నారు.
నిత్యం నిద్రాహారాలు మాని ప్రజల మధ్య ఉండే చంద్రబాబుని పబ్లిసిటీ కోసమే బాబు పాట్లు, ముఖ్యమంత్రి బాధిత ప్రాంతాలలో బస చెయ్యడం వల్ల అధికారులంతా బాబు చుట్టూ ప్రదక్షణలు చేస్తూ బాధిత కుటుంబాలకు సాయం అందించలేకపోతున్నారు అంటూ ఒకపక్క ముఖ్యమంత్రి పై విమర్శలు చేస్తూ మరో పక్క ఇటువంటి విపత్కర పరిస్థితులలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎక్కడ అంటూ మరో వాదన తెరమీదకు తెచ్చింది వైసీపీ.
అయితే వైసీపీ వాదనకు వంత పాడేలాగానే గత రెండు రోజుల నుంచి పవన్ జాడ కానీ, జనసేన ఊసు కానీ ఎక్కడ కనిపించలేదు, వినిపించలేదు. జనసేన ఓడిపోయినా పవన్ రెండు చోట్ల పరాజయాన్ని ఎదుర్కున్న ఎప్పుడు ప్రజలు కష్టానికి అందుబాటులో ఉంటూ తనకు చేతనైన సాయం అందించే పవన్ ఇప్పుడు కనిపించకుండా పోవడం పై అటు సోషల్ మీడియాలో కూడా పవన్ మిస్సింగ్ అంటూ కథనాలు మొదలుపెట్టారు.
అయితే ఇప్పుడు ఈ కథనాలకు, వైసీపీ విమర్శలకు చెక్ పెట్టేలా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మీడియా ముందుకొచ్చారు. గత ప్రభుత్వ నిర్లక్ష్యం పాపమే ఈ స్థాయి వరదలకు కారణమయ్యింది. ఇప్పుడు ఎవరి తప్పు అనే దాని మీద కాకుండా పరిస్థితులను చక్కదిద్దే ప్రయత్నంలో కూటమి ప్రభుత్వం పని చేస్తుందని వివరించారు.
అలాగే ఈ వరద బాధితుల సహాయార్థం కోటి రూపాయలను సీఎం రిలీఫ్ ఫండ్ కు విరాళంగా ప్రకటించారు పవన్. వరద తీవ్రత, కొనసాగుతున్న సహాయక చర్యల మీద ఆరా తీస్తూ రాష్ట్ర విపత్తు కార్యాలయంలో హోమ్ మినిస్టర్ అనితతో కలిసి సమీక్ష నిర్వహించారు. ప్రకాశం బ్యారేజ్ పూర్తిగా నిండడంతో పాటుగా బుడమేరు నుండి పెద్ద ఎత్తున వరద రావడంతో ఈ జల ప్రళయం సంభవించిందన్నారు.
పంచాయితీ శాఖ నుండి కూడా దాదాపు 200 మంది టీం ను ఈ ప్రాంతాలలో సహాయ కార్యక్రమాల కోసం కేటాయించడం జరిగిందంటూ వివరించారు. బ్యారేజ్ కు ఇంకో 12 వేల క్యూసెక్కుల నీరు వచ్చిఉంటె ఊహించని ప్రమాదం జరిగి ఉండేదని, దేవుని దయ వల్ల ఆ పరిస్థితి రాకపోవడం ఏపీ అదృష్టమన్నారు.
తన పర్యటనలతో వరద ప్రభావిత ప్రాంతాలలో సహాయక చర్యలకు ఆటంకాలు వస్తాయనే తానూ వరద బాధిత ప్రాంతాలలో పర్యటించలేదని తన పై వస్తున్న విమర్శలకు సమాధానమిచ్చారు పవన్. దీనితో పవన్ ఎక్కడ..ఎక్కడా అంటూ నీలి రాతలు రాస్తున్న వారికి ఇక్కడే అనే సమాధానం దొరికినట్టయ్యింది.




