ప్రధాని మోడీ నేడు సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్లో జరిగిన సభలో ఆటంబాంబు లాంటి మాట చెప్పారు. కనీసం ఒక ఏడాది పాటు దేశ ప్రజలందరూ బంగారం కొనుగోలు మానేయాలని లేదా బాగా తగ్గించుకోవాలని ప్రధాని మోడీ విజ్ఞప్తి చేశారు. బంగారం దిగుమతి తగ్గించుకోగలిగితే విదేశీ మారక ద్రవ్యం పెరుగుతుంది. ఆ సొమ్ముని ప్రజల ముఖ్యావసరాలకు ఉపయోగించుకోవచ్చు.
యుద్ధాల కారణంగా పెట్రోల్, డీజిల్ ధరలు అన్ని దేశాలలో పెరిగిపోయాయి. కానీ మన దేశంలో ఆ భారం ప్రజలపై పడకుండా నివారించగలిగాము. అయినప్పటికీ పెట్రోల్, డీజిల్ వినియోగం క్రమంగా తగ్గించుకుంటే దాని దిగుమతి తగ్గి భారీగా విదేశీ మారక ద్రవ్యం మిగులుతుంది. అందుకే విద్యుత్ వాహనాలను ప్రోత్సహిస్తున్నాము.
రైల్వే శాఖలో కూడా డీజిల్ ఇంజన్ల స్థానంలో విద్యుత్ ఇంజన్లను ప్రవేశపెడుతూ డీజిల్ భారం తగ్గించుకుంటున్నాము. అదేవిధంగా బంగారం కొనుగోలు విషయంలో దేశ ప్రజలు నియంత్రణ పాటించాలి,” అని ప్రధాని మోడీ విజ్ఞప్తి చేశారు.
భారత్లో ఏటా లక్షల కోట్ల బంగారం వ్యాపారం జరుగుతుంది. అందువల్లే ఇప్పుడు చిన్న చిన్న పట్టణాలలో కూడా పెద్ద పెద్ద బంగారు ఆభరణాల దుకాణాలు ఏర్పాటవుతున్నాయి.
బంగారు నగలు డిజైనింగ్, తయారీ, రవాణా, దుకాణాలలో పనిచేసేవారు లక్షల మంది ఉంటారు. ఏడాదిపాటు ప్రజలు బంగారం కొనుగోలు మానేస్తే ఆ దుకాణాలు, యజమానులు, లక్షల కోట్ల టర్నోవర్ కలిగిన వారి వ్యాపారాలు, లక్షల మంది ఉద్యోగుల పరిస్థితి ఏమిటి?
బంగారం వ్యాపారం మరింత పెంచుకోవాలని వ్యాపారులు సినీ తారలకు కోట్లు రూపాయలు పారితోషికాలు చెల్లించి వాణిజ్య ప్రకటనలు చేయిస్తుంటారు.
ప్రధాని మోడీ మాట విని దేశంలో ఒక్క శాతం ప్రజలు బంగారం కొనుగోలు చేయడం మానేసినా లేదా తగ్గించినా ఆ ప్రభావం వారందరిపై పడకుండా ఉంటుందా?
బంగారమే కాదు… మద్యం, సిగరెట్లు కూడా మానేయమని చెప్పడానికి ఏ ప్రభుత్వమూ సాహసించదు. ఆరోగ్యానికి హానికరం అని చెపుతాయి కానీ మానేయమని చెప్పవు. దేనికంటే ఆ ఆదాయమే ప్రభుత్వాలకు కీలకంగా నిలుస్తున్నప్పుడు ఎలా చెప్పగలవు? బంగారం కూడా అంతే!




