కోట్లు రూపాయలు ఖర్చుచేసి వారం రోజులుగా మంత్రులు, వైసీపీ ఎమ్మెల్యేలు, ఎంపీ విజయసాయి రెడ్డి అందరూ రేయింబవళ్లు కష్టపడి ఈరోజు ప్రధాని నరేంద్రమోడీ సభకు భారీగా ఏర్పాట్లు చేసి జనసమీకరణ చేస్తే దాని గురించి ప్రధాని మోడీ మాట మాత్రంగానైనా మెచ్చుకోలేదు. సిఎం జగన్మోహన్ రెడ్డి, మంత్రులు అందరూ విమానాశ్రయంలో ప్రధాని నరేంద్రమోడీకి ఘనంగా స్వాగతం, వీడ్కోలు పలికితే ఆయన సింపుల్గా టాటాబైబై చెప్పేసి వెళ్ళిపోయారు.
“అత్త కొట్టినందుకు బాధపడటం లేదు… తోటికోడలు చూసి నవ్విందనే ఏడుస్తున్నాను,” అన్నట్లు ప్రధాని నరేంద్రమోడీ తమ కష్టాన్ని గుర్తించకపోయినా వైసీపీ నేతలు బాధపడలేదు. కానీ తాము ఎంతగానో ద్వేషిస్తున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ని ప్రధాని నరేంద్రమోడీ ప్రత్యేకంగా పిలిపించుకొని ఏకాంతంగా అర్దగంటసేపు మాట్లాడటం వారు జీర్ణించుకోవడం చాలా కష్టమే. వారి కడుపు మంట పోలీస్ కేసు రూపంలో బయటపడింది.
జగన్ ప్రభుత్వం రాష్ట్రంలో ప్రతిపక్షాలపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతూ, పోలీసులతో వేధింపజేస్తోందని పవన్ కళ్యాణ్ ప్రధాని నరేంద్రమోడీకి చేసిన పిర్యాదులలో ఒకటి. అయితే మోడీ విమానం విశాఖ విమానాశ్రయం నుంచి పైకి లేవగానే పవన్ కళ్యాణ్ మీదే పోలీసులు కేసు నమోదు చేయడం విశేషం.
ఇటీవల ఆయన మంగళగిరి నియోజకవర్గంలోని ఇప్పటం గ్రామానికి వెలుతున్నప్పుడు వేగంగా వెళుతున్న కారు టాపు మీద కూర్చొని ప్రయాణించారని, ఆయనతో పాటు కొందరు అనుచరులు కూడా కారు టాపుపై కూర్చొని ప్రయాణించారని, కార్లు ర్యాష్ డ్రైవింగ్ చేశారని తాడేపల్లి పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఐపీసీ సెక్షన్ 336, రెడ్ విత్ 177 మోటార్ వెహికల్స్ యాక్ట్ కింద పోలీసులు కేసు నమోదు చేశారు. తెనాలి పట్టణంలోని మారిస్పేటకు చెందిన శివ అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదుపై శుక్రవారం ఈ కేసు నమోదు చేసినట్లు తాడేపల్లి పోలీసులు తెలిపారు.
కారు టాపు మీద కూర్చొని ప్రయాణించడం చాలా ప్రమాదకరం… చట్ట ప్రకారం నేరం కూడా కనుక ఈ కేసును తప్పుపట్టలేము. కానీ పవన్ కళ్యాణ్ ఇప్పటం గ్రామంలో పర్యటించి అప్పుడే 5-6 రోజులయ్యింది. పోలీసులు వెంటనే కేసు నమోదు చేయవచ్చు కానీ అప్పుడు చేయకుండా ఇప్పుడు చేశారు. కనుక ఇది ఎసిడిటీ సమస్యగానే భావించవచ్చు. ఏది ఏమైనప్పటికీ అభిమానులకి ఆదర్శంగా నిలవాల్సిన పవన్ కళ్యాణ్ ఈవిదంగా చేయడం సరికాదు. జాతీయ మీడియా సైతం పవన్ కళ్యాణ్ తీరును తప్పు పడుతూ వార్తలు వచ్చాయి.



