సినిమాలో హీరోయిజం హైలైట్ అవ్వాలంటే చాలా బలమైన విలన్ ఉండాలి. కానీ మన రాజకీయాలలో వేరే రూల్ ఉంది. హీరోలు, విలన్లకు మద్య సన్నటి గీత ఉంటుంది. ఆ గీతని గుర్తించడం చాలా కష్టం.
కనుక రాజకీయాలలో హీరోలు ఎవరో, విలన్లు ఎవరో గుర్తించడం ప్రజలకు ఎప్పుడూ పెద్ద అగ్నిపరీక్షగానే ఉంటుంది. ఒకవేళ గుర్తించినా వారికి వేరే ఆప్షన్ ఉండదు.
ఏ కారణం చేతైనా పోలీసులు తమ ఇంటికి వస్తే పరువుపోతుందని సామాన్య మధ్యతరగతి, నిరుపేద ప్రజలు ఆందోళన చెందుతుంటారు. కానీ అవినీతి కేసులలో చిక్కుకున్న మన ప్రజా ప్రతినిధులు, నేతలు మాత్రం ఈ కేసులు, విచారణ, జైలు, బెయిలు అన్నీ కూడా తమ రాజకీయాలకు లభించిన గొప్ప గుర్తింపుగా భావిస్తుంటారు. వాటినే పద్మశ్రీ, పద్మభూషణ్ అవార్డులన్నట్లు భావిస్తుంటారు.
అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నవారే ప్రభుత్వం, పోలీసులు, దర్యాప్తు అధికారులని కించపరుస్తూ తాము ఆనిముత్యాలమని, రాజకీయ బాధితులమని ప్రజలను నమ్మించే ప్రయత్నం చేస్తుంటారు. దీని కోసం తమ పార్టీ శ్రేణులు, సొంత మీడియా, సోషల్ మీడియా సేవలను చాలా తెలివిగా ఉపయోగించుకుంటారు.
ఉదాహరణకు ఇక్కడ మద్యం కుంభకోణం కేసులో, అక్కడ ఫోన్ ట్యాపింగ్ కేసులలో విచారణకు హాజరవుతున్న వైసీపీ, బీఆర్ఎస్ పార్టీల ప్రజా ప్రతినిధులు మీడియా సమావేశాలు పెట్టి ప్రభుత్వాన్ని, పోలీసులను నిందిస్తుంటారు. అవహేళన చేస్తుంటారు.
ఆ సమావేశంలోనే చట్టం, పోలీసులు, న్యాయ వ్యవస్థలు అంటే తమకి చాలా గౌరవం అంటూనే, “ప్రభుత్వం సిట్ అంటే కూర్చుంటారు. స్టాండ్ అంటే నిలబడతారు ఈ అధికారులు. వీరా… మమ్మల్ని ప్రశ్నించేది? మేము అధికారంలోకి రాగానే ఒక్కొక్కడికీ యూనిఫారం ఇప్పించి రోడ్డుపై నిలబెడతాము,” అని విచారణకు బయలుదేరే ముందు ముగిసిన తర్వాత బెదిరిస్తుంటారు.
“విచారణాధికారులంటే నాకెందుకు భయం? వారే నన్ను చూసి భయపడతారు. వారు నన్ను అడగడం కాదు నేనే వాళ్ళని ప్రశ్నలు అడుగుతాను,” అని మీడియా సమావేశంలో చెప్పి మరీ మందిమార్భాలంతో బలదర్శన చేస్తూ విచారణకు బయలుదేరుతున్నారు.
వారు లోనికి వెళ్ళేటప్పుడు తిరిగి బయటకు వచ్చేటప్పుడు బయట వారి అనుచరులు చేసే హడావుడి, సదరు నేతలకు షేక్ హ్యాండ్ ఇచ్చేందుకు చేసే హడావుడి అంతా ఇంతా కాదు.
సదరు నేతలు కూడా బయటకు రాగానే అంతరిక్షయాత్ర చేసివచ్చినట్లు చిరునవ్వులు చిందిస్తూ అక్కడ తమ కోసం ఎదురు చూస్తున్న అనుచరులకు షేక్ హ్యాండ్స్ ఇస్తుంటారు. వారి హడావుడి చూస్తున్నప్పుడు ‘వారి విషయంలో మనమే పొరబడుతున్నామేమో?వారు అవినీతికి పాల్పడలేదేమో?’ అని సామాన్య ప్రజలకు సందేహం కలుగక మానదు.
సామాన్య ప్రజలకు ఇలాంటి ఆలోచన కలిగించేలా చేయడం కోసమే ఇంత పకడ్బందీ స్క్రీన్ ప్లేతో ఈ సన్నివేశానికి రక్తి కట్టిస్తున్నారని చెప్పక తప్పదు. లేకుంటే పోలీస్ స్టేషన్కు, జైలుకి వెళ్తున్నప్పుడు అంతమందిని వెంటపెట్టుకొని ఎందుకు వెళ్తున్నట్లు? వద్దని వారిస్తే ఎవరూ రారు కదా?
కేసు విచారణపై ఏవిధంగా కూడా ప్రభావం చూపకూడదని విచారణాధికారులు పదేపదే చెపుతుంటారు. కానీ ఈ మీడియా సమావేశంలో వారు చెప్పే మాటలు, పోలీస్ స్టేషన్, జైలు బయట వారి అనుచరులు చేసే ఈ డ్రామాతో విచారణాధికారులపై ఎటువంటి ఒత్తిడి ఏర్పడకకుండా ఉంటుందా? వారు మనుషులే కదా?వారూ ఈ సమాజంలోనే ఈ నాయకుల మద్యనే బ్రతకాలి కదా?
కనుక న్యాయ వ్యవస్థ కలగజేసుకొని మన రాజకీయ నాయకులు, ప్రజా ప్రతినిధులు, వారి అనుచరుల ఈ ధోరణిని మార్చడం చాలా అవసరం. లేకుంటే అందరూ కలిసి వ్యవస్థలను నిర్వీర్యం చేసేస్తారు. ఇప్పటికే కొంత చేసేశారు. న్యాయస్థానాలు నిర్లిప్తంగా ఊరుకుంటే పూర్తిగా నిర్వీర్యం చేసేస్తారు.






