రెండు తెలుగు రాష్ట్ర రాజకీయాలలో అధికార – విపక్షాల మధ్య పాత పంచాయితీలతో కొత్త రాజకీయం నడుస్తుంది. అయితే తెలంగాణ విషయానికొస్తే రాష్ట్ర విభజనకు పూర్వం మొదలైన ఏపీ – తెలంగాణ నీటి పంచాయితీ ఇప్పటికి ప్రాంతీయ విభేదాలను సృష్టిస్తూనే ఉన్నాయి.
వాటి ద్వారా అటు కాంగ్రెస్ ఇటు బిఆర్ఎస్ రాజకీయ ప్రయోజనం పొందే ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. తెలంగాణ కృష్ణా నదీ జలాల హక్కుల విషయంలో కేసీఆర్ తెలంగాణకు అన్యాయం చేసారంటూ ముఖ్యమంత్రి రేవంత్ వాదిస్తుంటే,
ఏపీ ముఖ్యమంత్రి బాబు తో రేవంత్ కు ఉన్న సంబంధాలే తెలంగాణ నీటి హక్కులను కోల్పోయేలా చేస్తుంది అంటూ బిఆర్ఎస్ ఆరోపిస్తుంది. ఇలా ఇక్కడ తెలంగాణలో అధికార – విపక్షాల మధ్య ఏనాటి నీటి పంచాయితీల కోసమో ఈనాడు కొత్త రాజకీయం షురూ అయ్యింది.
ఇక ఆంధ్రప్రదేశ్ విషయానికొస్తే.., ఇక్కడ విచిత్రంగా క్రిడిట్ ల లొల్లి జరుగుతుంది. కూటమి ప్రభుత్వ రాకతో 2014 – 2019 మధ్య ఆగిపోయిన నాటి అభివృద్ధి పనులను కొత్త ప్రభుత్వం పట్టాలెక్కించాయి, అలాగే వాటి తాలూకా ఫలాలను ప్రజలకు అందుబాటులోకి తెచ్చింది.
ఈ నేపథ్యంలో 2019 – 2024 మధ్య నవరత్నాల బటన్ నొక్కే పాలన చేసిన వైస్ జగన్ మోహన్ రెడ్డి ఇప్పుడు ప్రజలకు అందుతున్న అభివృద్ధి ఫలాల క్రిడిట్ తనదే అంటూ మీడియా ప్రెస్ మీట్లు పెట్టి మరి ఏపీలో క్రిడిట్ చోరీ జరుగుతుంది, నాకు దక్కాల్సిన క్రిడిట్ నాకు రాకుండా చేస్తున్నారు అంటూ భోగాపురం ఎయిర్ పోర్ట్ క్రిడిట్ తనదే అంటూ సొంత డప్పా కి తెరలేపారు.
అయితే 2019 ఎన్నికల ముందు అసలు ఎర్ర బస్సే రాని ఈ ప్రాంతానికి ఎయిర్ బస్ అవసరమా.? విశాఖలో ఇంటర్ నేషనల్ ఎయిర్ పోర్ట్ ఉండగా బుర్ర బుద్ది ఉన్నవాడెవడైన మళ్ళీ భోగాపురంలో ఎయిర్ పోర్ట్ నిర్మిస్తాడా.? అంటూ నాటి ముఖ్యమంత్రి బాబు ను హేళన చేస్తూ ఆ ప్రభుత్వ నిర్ణయాలను ఎద్దేవా చేసారు జగన్.
ఇప్పుడు 2026 జాన్ 4 న భోగాపురం ఎయిర్ పోర్ట్ లో తొలి విమానం ల్యాండ్ అయ్యి ఎయిర్ పోర్ట్ ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. అయితే నాడు ఈ ఎయిర్ పోర్ట్ అసలు అనవసరం అంటూ వాదించిన జగన్ నేడు మాత్రం ఆ క్రిడిట్ నాదే అంటూ గగ్గోలు చేస్తున్నారు.
ఈ ఒక్క విషయంలోనే కాదు గతంలో విశాఖలో ఏర్పాటు చేయనున్న గూగుల్ డేటా సెంటర్ విషయంలో కూడా క్రిడిట్ కోసం వైసీపీ ఇదే విధంగా పాకులాడింది. కూటమి ప్రభుత్వం డేటా సెంటర్ ఏర్పాటుకు గూగుల్ తో ఒప్పందాలు కుదురుకున్న రోజు అసలు విశాఖకు డేటా సెంటర్ ఎందుకు.?
డేటా సెంటర్ వల్ల రాష్ట్రానికి ఒరిగే మంచేమిటి.? ఆ సెంటర్ ఏర్పాటు వల్ల యువతకు పెద్దగా ఉద్యోగావకాశాలు రావు, అటువంటి సెంటర్ ఏర్పాటుకు వేలకోట్ల విలువైన భూములు అప్పగిస్తారా అంటూ నాడు కూటమి ప్రభుత్వ నిర్ణయాలను తప్పుబట్టిన వైసీపీ ఇప్పుడు అసలు డేటా సెంటర్ విశాఖ కు రావడానికి పునాదులేసిందే వైసీపీ అంటూ ఆ క్రిడిట్ కూడా తనకే దక్కాలంటూ మారం చేస్తున్నారు జగన్.
ఇలా ఏపీలో వైసీపీ క్రెడిట్ల కోసం రాజకీయం చేస్తుంది. క్రెడిట్ అనేది ఇలా మీడియా ప్రెస్ మీట్లు పెట్టి చెప్పుకోకూడదు, మీడియానే తన వార్తల ద్వారా, తన కథనాల ద్వారా ఆ క్రిడిట్ వారి ఖాతోలో వెయ్యాలి, వేసేలా చేసుకోవాలి. నిజంగా వైసీపీ అందుకు అర్హత కలిగి ఉంటే అది ఎవరు అవునన్నా కాదన్నా వారికీ ఆ క్రిడిట్ తప్పక చేరుతుంది.
ఉదాహరణకు అమరావతి విధ్వంశం విషయంలో వైసీపీ ఎంతలా చేసిన తప్పులను కప్పిపుచ్చుకోవాలని చూసినా, ఇప్పటికి చూస్తున్నా ప్రాంతీయ మీడియా నుంచి జాతీయ మీడియా వరకు అమరావతి అరణ్యరోదన క్రిడిట్ వైసీపీ దే, దానికి పునాది వేసింది జగన్ మూడు రాజధానుల నిర్ణయమే అంటూ ఆ క్రిడిట్ మొత్తం జగన్ ఖాతాలో గంపగుత్తగా పడేస్తున్నారు.
అలాగే హైటెక్స్ సిటీ నిర్మాణంతో హైద్రాబాద్ అభివృద్ధి, సైబరాబాద్ నగర నిర్మాణానికి పునాది వేసింది చంద్రబాబు నాయుడే అనే సత్యాన్ని బాబు ప్రత్యర్థి పార్టీ అయిన బిఆర్ఎస్ సైతం అంగీకరిస్తుంది, దాని క్రిడిట్ బాబు కే సొంత అంటూ ఆమోదిస్తుంది. ఇలా క్రెడిట్లు అనేది అడిగితేనే, డిమాండ్ చేస్తేనో వచ్చేది కాదు మనం చేసే పనులతో, మాట్లాడిన మాటలతో అందుకు ఎంచుకున్న విధానాలతో దానంతట అదే వచ్చి చేరాలి.






