చంద్రబాబు ఒత్తిడి చేస్తే విజయసాయి రాజీనామా చేస్తారా?

r-krishnaiah-vijaya-sai-reddy

ఆర్‌ కృష్ణయ్య బీసీల నాయకుడుగా తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నందునే, జగన్మోహన్‌ రెడ్డి ఆయనని పిలిచి రాజ్యసభ సీటు ఇచ్చారు. కానీ ఇంకా నాలుగేళ్ళ పదవీకాలం ఉండగానే ఆయన మంగళవారం తన పదవికి రాజీనామా చేశారు. రాజ్యసభ సీటు కోసం దేశంలో ఎంతో మంది రాజకీయనాయకులు ఆరాటపడుతుంటారు. అటువంటి పదవిని ఆర్‌ కృష్ణయ్య బలమైన కారణం ఏమీ లేకుండా వదులుకుంటారని అనుకోలేము.

ADVERTISEMENT

ఆయనకి బీజేపీ గవర్నర్ లేదా జాతీయ బీసీ కమీషన్‌ ఛైర్మన్‌ పదవి ఆఫర్ ఇచ్చిందని అందుకే రాజీనామా చేశారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కానీ బీజేపీ ఆయనను చంకనెక్కించుకోవడానికి బలమైన కారణం ఏదీ కనిపించడం లేదు. ఎందుకంటే ఆయన తెలంగాణ రాజకీయాలలో కూడా రాణించలేకపోయారు. ఎటువంటి ప్రభావం చూపలేకపోయారు.

ఆర్‌ కృష్ణయ్య తన పదవికి రాజీనామా చేయగానే తెలంగాణ కాంగ్రెస్‌ ఎంపీ మల్లు రవితో హైదరాబాద్‌లో భేటీ అయ్యారు. తెలంగాణలో కాంగ్రెస్‌ అధికారంలో ఉంది కనుక అది ఆయనకు ఏమైనా పదవి ఆఫర్ చేసిందా?అనే అనుమానం కలుగుతోంది.

త్వరలో కాంగ్రెస్‌ ప్రభుత్వం తెలంగాణలో కులగణన ప్రక్రియ చేపట్టబోతోంది. తాను దాని కోసం ఉద్యమిస్తామని ఆర్‌ కృష్ణయ్య చెపుతున్నారు. అంటే కాంగ్రెస్‌ పార్టీలో చేరబోతున్నారా?అనే సందేహం కలుగుతుంది.

ఆయన ఏ కారణంతో తన రాజ్యసభ సీటుకి రాజీనామా చేసినప్పటికీ దాని వలన వైసీపికి ఒక రాజ్యసభ సీటు చేజారిపోగా, ఆ సీటు టిడిపి కూటమి వశం కాబోతోంది.

కనుక చంద్రబాబు నాయుడే ఆయనపై ఒత్తిడి చేసి రాజీనామా చేయించారని వైసీపి ఎంపీ విజయసాయి రెడ్డి కనిపెట్టి ట్వీట్ చేశారు. కనుక మిగిలిన వారి చేత కూడా చంద్రబాబు నాయుడు రాజీనామా చేయించేస్తారా? చంద్రబాబు నాయుడు ఒత్తిడి చేస్తే వైసీపి ఎంపీలు రాజీనామాలు చేసేస్తుంటే అది వైసీపి నాయకత్వ లోపంగానే చూడాలి కదా? ఈ లెక్కన చంద్రబాబు నాయుడు ఒత్తిడి చేస్తే విజయసాయి రెడ్డి కూడా తన పదవికి రాజీనామా చేసేస్తారా? ఆయనే చెప్పాలి.

ADVERTISEMENT
Latest Stories