కేసీఆర్‌ పిలక చేతిలో ఉంచుకోవాలనే రేవంత్‌ రెడ్డి…

Rahul-Gandhi-Sonia-Gandhi-KCR-Revanth-Reddy

ఇదివరకు చెప్పుకున్నట్లుగా, ప్రతిపక్షాలపై నమోదు చేసిన కేసులన్నీ వారిని శిక్షించేందుకు కాదు! భయపెట్టి లొంగదీసుకునేందుకు, లేదా అవసరమైనప్పుడు వాటిని ప్రయోగించి రాజకీయంగా ఎదురుదెబ్బ తీసేందుకు మాత్రమే.

ఓటుకి నోటు కేసు, ఢిల్లీ లిక్కర్ స్కామ్‌, వివేకా హత్య కేసు, చంద్రబాబు నాయుడుపై జగన్‌ ప్రభుత్వం నమోదు చేసిన కేసులతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏవిదంగా వాడుకుంటున్నాయో గమనిస్తే ఈ విషయం అర్దమవుతుంది. కనుక కేసులన్నీ వట్టి కేసులు కావు. అధికార పార్టీ చేతిలో బ్రహ్మస్త్రాలన్న మాట!

ADVERTISEMENT

దీనికి మరో తాజా ఉదాహరణగా తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతిపై విచారణ. ఈ కేసుతో సహా మరికొన్ని పిల్ల కేసులు కూడా రేవంత్‌ ప్రభుత్వం సిద్దం చేస్తోంది. వీటిపై బిఆర్ఎస్, కాంగ్రెస్‌, బీజేపీ నేతల వాదనలు వింటే ఈ కేసుల పరమార్ధం గ్రహించవచ్చు.

లక్షల కోట్ల అవినీతికి పాల్పడిన కేసీఆర్‌ & కో తప్పకుండా జైలుకి వెళ్ళక తప్పదని కాంగ్రెస్‌ మంత్రులు హెచ్చరిస్తున్నారు. లోక్‌సభ ఎన్నికల తర్వాత బిఆర్ఎస్ ఎమ్మెల్యేలలో కేసీఆర్‌, కేటీఆర్‌, హరీష్ రావువంటి నాలుగురైదుగురు తప్ప మిగిలినవారందరూ కాంగ్రెస్ పార్టీలో చేరిపోతారని జోస్యం చెపుతున్నారు. లేకుంటే కేసులు వారి మెడకు చుట్టేస్తామని హెచ్చరిస్తున్నట్లే భావించవచ్చు.

కేటీఆర్‌, హరీష్ రావులు మాట్లాడుతూ, “ప్రజలకు మాయ మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ నేతలు, వాటిని అమలు చేయలేక, వాటి గురించి నిలదీస్తున్న మాపై లేనిపోని అవినీతి ఆరోపణలు చేస్తూ రాజకీయ కక్ష సాధింపుకి సిద్దమవుతున్నారు. కానీ వారి బెదిరింపులకు భయపడే వాళ్ళం కాము,” అని వాదిస్తున్నారు. అంటే కేసులన్నీ రాజకీయ కక్ష సాధింపులకు వాడుకోవచ్చని స్పష్టమవుతోంది.

ఒకప్పుడు కాంగ్రెస్‌లో ఉంది బీజేపీలో చేరిన మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఇంకా సంచలన విషయం చెప్పారు. “కాంగ్రెస్‌ అంటే రేవంత్‌ రెడ్డి ఒక్కరే కాదు. ఈ కేసులు, విచారణ అన్నిటినీ నిర్ణయించేది, నియంత్రించేది కాంగ్రెస్‌ అధిష్టానమే. రేవంత్‌ రెడ్డి కేవలం నిమిత్తమాత్రుడు.

మరోవిషయం ఏమిటంటే, కాంగ్రెస్‌, బీజేపీలు ముఖాముఖీ తలపడిన చోటల్లా కాంగ్రెస్‌ ఓడిపోతోంది కనుక కేసీఆర్‌లాంటి వారు మద్యలో ఉండేలా కాంగ్రెస్‌ అధిష్టానం ఇటువంటి జాగ్రత్తలు తీసుకుంటుంది. అందుకే కాళేశ్వరం ప్రాజెక్టులో భారీగా అవినీతి జరిగిందని తెలిసి ఉన్నా, మేడిగడ్డ బ్యారేజి క్రుంగిపోయినా, రేవంత్‌ రెడ్డి ఈ కేసులను సీబీఐకి అప్పగించడం లేదు. దానిపై న్యాయవిచారణకు ఆదేశిస్తున్నారు.

న్యాయ విచారణ అంటే 10,15 సంవత్సరాలైనా సాగదీయవచ్చు. ఈ కేసులన్నీ కాంగ్రెస్‌ చేతిలో ఉంటేనే కేసీఆర్‌ని కట్టడి చేయగలదు. కనుక కాంగ్రెస్‌ అధిష్టానమే కేసీఆర్‌ని జాగ్రత్తగా కాపాడుకుంటోంది,” అని అన్నారు.

ఇదీ కేసులు… వాటి వెనుక ఉండే కధ!

ADVERTISEMENT
Latest Stories