సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన ‘కబాలి’ సినిమాకు భిన్న స్పందనలు వ్యక్తమైన విషయం తెలిసిందే. అయితే చాలాకాలం తర్వాత రజనీ సిల్వర్ స్క్రీన్ పై దర్శనమివ్వడంతో సినీ ప్రేక్షక జనం ప్రీమియర్ షోల నుండే క్యూలు కట్టడం ప్రారంభించారు. భారీ ఓపెనింగ్స్ తో ఆరంభమైన ‘కబాలి’ తొలి రోజు ఎంత వసూళ్లు చేసి ఉంటుందనే దానిపై ఇప్పటివరకు అనేక అంచనాలు వ్యక్తమయ్యాయి. తొలి రోజే 100 కోట్ల మ్యాజిక్ ఫిగర్ ను సొంతం చేసుకుని, ఇండియన్ సినిమా హిస్టరీలో ఒక నూతన అధ్యాయానికి నాంది పలికిందన్న సమాచారం హల్చల్ చేస్తున్న నేపధ్యంలో, ఈ సినిమా నిర్మాత ఒక అవాక్కయ్యే అధికారిక ప్రకటనను జారీ చేసారు.
‘కబాలి’ సినిమా మొదటి రోజున 250 కోట్లను వసూలు చేసిందని నిర్మాత కలైపులి ఎస్ థాను ఒక ప్రకటనలో తెలిపారు. ఒక్క తమిళనాడు రాష్ట్రంలోనే 100 కోట్లు వచ్చాయని, మిగతా అన్ని భాషలలో, అన్ని చోట్ల నుంచి 150 కోట్లు వసూలు చేసిందని వెల్లడించి, ఒక్కసారిగా ట్రేడ్ పండితులను అవాక్కు చేసాడు. కలెక్షన్స్ పై ‘కబాలి’ నిర్మాత చేసిన ప్రకటన సినీ వర్గీయులను ఆశ్చర్యంలో ముంచెత్తగా, మరికొందరు మాత్రం ఈ కలెక్షన్స్ పై విమర్శలు చేసారు. బహుశా ఏరియా వారీలుగా, భాష ప్రకారం వసూళ్ళని విభజించి చెప్పినట్లయితే మరింత స్పష్టత ఇచ్చినట్లయ్యేదని విమర్శకులు వ్యక్తపరుస్తున్న అభిప్రాయం.
యూకే, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, శ్రీలంక, స్విట్లర్లాండ్, డెన్మార్క్, సాలెండ్, స్వీడన్, సౌతాఫ్రికా, నైజీరియా, మలేషియా తదితర దేశాల్లో మంచి ఓపెనింగ్స్ వచ్చాయని, రజనీ స్టామినాకు ఇదే నిదర్శనమని నిర్మాత అన్నారు. ఓ భారత నటుడి సినిమాకు తొలి రోజున వచ్చిన అత్యధిక కలెక్షన్లు ‘కబాలి’దేనని ప్రకటించారు. యఎస్ లో 480, మలేషియాలో 490, గల్ఫ్ దేశాల్లో 500 థియేటర్లలో చిత్రం విడుదల చేయగా, ప్రపంచవ్యాప్తంగా దాదాపు 10 వేల స్క్రీన్లలో సినిమా ప్రదర్శితమవుతోందని అన్నారు.



