ప్రపంచ వ్యాప్తంగా సూపర్ స్టార్ మేనియా కనపడుతోంది. భారీ అంచనాలతో ఈ నెల 22వ తేదీన ‘కబాలి’ విడుదలకు సిద్ధం కావడంతో, ప్రస్తుతం ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు కూడా ఊపందుకున్నాయి. ఇదిలా ఉంటే.., సినీ ప్రేక్షకుల్లో, జనాల్లో ఉన్న ‘కబాలి’ ఫీవర్ ను ఇప్పటికే పలు బిజినెస్ దిగ్గజాలు తమ వ్యాపారానికి వినియోగించిన విషయం తెలిసిందే. తాజాగా ఆ కోవలోనే ప్రముఖ టెలికం సంస్థ ‘ఎయిర్ టెల్’ కూడా వచ్చి చేరింది.
సూపర్ స్టార్ రజనీకాంత్ ‘కబాలి’ పేరిట ప్రత్యేక సిమ్ కార్డులను విక్రయించాలని ఎయిర్ టెల్ సంస్థ నిర్ణయించింది. ఈ సిమ్ కార్డులపై రజనీ ‘కబాలి’ పోస్టర్ ఉండనుందని సమాచారం. ఈ సిమ్ లో ‘కబాలి’కి సంబంధించిన ప్రీ లోడెడ్ వాల్ పేపర్స్, పాటల రింగ్ టోన్స్ వంటివి కూడా ఉండనున్నాయని తెలుస్తోంది. అయితే, ఇప్పటికే ఎయిర్ టెల్ కనెక్షన్ ఉన్నవారికి స్పెషల్ రీచార్జ్ ని అందుబాటులోకి తీసుకురావాలన్న ప్రతిపాదనలను ఎయిర్ టెల్ సిద్ధం చేస్తున్నట్లు మార్కెట్ వర్గాలు చెప్తున్నాయి.
మొత్తమ్మీద ‘కబాలి’ మేనియా ఇండియన్ సినిమా చరిత్రనే తిరగరాస్తోంది. ఒక సినిమాకు ఈ స్థాయిలో క్రేజ్ దక్కుతుందని బహుశా ఎవరూ అంచనాలు వేసి ఉండకపోవచ్చు. ‘కబాలి’ పాజిటివ్ టాక్ తెచ్చుకుంటే ‘బాహుబలి’ రికార్డుల దరి చేరుకుంటుందా? అన్నది ట్రేడ్ వర్గాల్లో మిక్కిలి ఆసక్తికరమైన ప్రశ్నగా మారింది.



