ఒకప్పుడు హీరోయిన్లంటే నిజజీవితంలో సామాన్యులకు కనపడని రూపం. అందుకే వారిపై క్రేజ్ అంత ఎక్కువగా ఉండేది. ప్రస్తుతం క్రేజ్ విషయంలో ఏమాత్రం తగ్గలేదు గానీ, నవతరం తారామణులు మాత్రం పలు సామాజిక కార్యక్రమాల ద్వారా ప్రేక్షకులకు దగ్గరవుతున్నారు. తాజాగా తెలంగాణా ప్రభుత్వం చేపట్టిన ఓ కార్యక్రమంలో టాలీవుడ్ టాప్ హీరోయిన్లు రకుల్ ప్రీత్ సింగ్, రాశి ఖన్నాలు భాగస్వామి అయ్యారు.
కేసీఆర్ సర్కార్ చేపట్టిన “హరితహారం” ప్రాజెక్టులో భాగంగా హైదరాబాద్, కేబీఆర్ పార్కు వద్ద ఏర్పాటైన ఓ కార్యక్రమంలో రాశి, రకుల్ లు భాగస్వామి అయ్యి సందడి చేశారు. పార్కు వద్ద ఉన్న సందర్శకులకు స్వయంగా తమ చేతులతో మొక్కలను పంపిణీ చేసిన పిదప, మరికొన్ని మొక్కలను నాటి తమ స్వహస్తాలతో నాటి, నీళ్ళు పోసారు. ఈ ముద్దుగుమ్మల సామాజిక కార్యక్రమాలు చూసి అభినందించడం స్థానికుల వంతయ్యింది.
ప్రతి ఒక్కరూ ఓ మొక్కను నాటి దాన్ని సంరక్షించడం ద్వారా భవిష్యత్ తరాలకు పరిశుభ్రమైన వాతావరణాన్ని అందించిన వారమవుతామని రకుల్ వ్యాఖ్యానించింది. ప్రభుత్వం చేపట్టిన ‘హరితహారం’ విజయవంతానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సూచించింది. ఈ కార్యక్రమంలో హైదరాబాద్ మేయర్ బొంతు రామ్మోహన్, పలువురు ప్రభుత్వ అధికారులు సైతం పాల్గొన్నారు.



