నోట్ల రద్దు తర్వాత పలుమార్లు తీపి కబురు చెప్పిన కేంద్ర ప్రభుత్వం మరో మారు అటువంటి కబురే చెప్పింది. పెద్ద నోట్ల రద్దు తర్వాత ప్రజలను ఆన్ లైన్ లావాదేవీల వైపు మరల్చేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్న మోడీ సర్కారు అందులో భాగంగా అనేక ప్రోత్సాహకాలు ప్రకటిస్తోంది. ఖాతాదారులు వెయ్యి రూపాయలకు పైగా జరిపే ఆన్ లైన్ లావాదేవీలపై ఎటువంటి చార్జీలు వసూలు చేయరాదని అన్ని ప్రభుత్వ రంగ బ్యాంకులకు ఆదేశాలు జారీ చేసింది. ఐఎంపీఎస్, యూపీఐ, ఎన్ఈఎఫ్టీపై ఎలాంటి చార్జీలు విధించవద్దని బ్యాంకులను ఆదేశించింది.
కేంద్రం నుండి ఇలా ‘స్వీట్ న్యూస్’ అందిన కాసేపటికే, రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా మరో ‘హాట్ న్యూస్’ వెల్లడించింది. ఇక నుంచి బ్యాంకులు, ఏటీఎంల నుంచి నగదు డ్రా చేస్తే 0.5-2 శాతంతో సర్ చార్జి విధించాలని భావిస్తోంది. ఈ నెల 30 తర్వాత నుంచే ఈ నిర్ణయాన్ని అమలు చేయాలని భావిస్తోంది. అయితే కనీస పరిమితికి మించి నగదు డ్రా చేసే వారికే ఈ సర్ చార్జ్ విధించనున్నట్టు సమాచారం.
బ్యాంకుల నుంచి అయితే రోజుకు 50 వేలు, ఏటీఎంల నుంచి అయితే రోజుకు 15 వేలకు మించి డ్రా చేస్తే నిర్వహణ వ్యయం పేరుతో సర్ చార్జి విధించాలని యోచిస్తున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ ప్రతిపాదన పరిశీలనలో ఉంది. సర్ చార్జి నిబంధనను 4-6 మాసాలు అమలు చేయాలని భావిస్తున్నప్పటికీ ఇది శాశ్వతంగా కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయని ప్రభుత్వ వర్గాల సమాచారం.
ఇదిలా ఉంటే… నవంబరు 10 నుంచి ఇప్పటివరకు 5.92 లక్షల కోట్ల నగదు పంపిణీ చేశామని ఆర్బీఐ అధికారులు వెల్లడించారు. మొత్తం 2,260 కోట్ల కొత్త నోట్లను పంపిణీ చేసామని, దేశంలోని అన్ని ప్రాంతాల్లోకి కొత్త నోట్లు అందేలా చర్యలు తీసుకుంటున్నామని, త్వరలోనే ప్రజలకు పూర్తి స్థాయిలో కొత్తనోట్లు అందుతాయని పేర్కొన్నారు. అక్రమ లావాదేవీలపై నిఘా ఉంచి అక్రమాలకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు.



