తెలంగాణలో కేసీఆర్, బీఆర్ఎస్ పార్టీకి ఎదురేలేదన్నట్లు సాగుతున్నప్పుడు కాంగ్రెస్ పార్టీలోకి రేవంత్ రెడ్డి బాహుబలిలా ప్రవేశించారు. పార్టీలో సీనియర్ల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొంటూనే, అందరినీ ఒక్కతాటిపైకి తెచ్చారు.
కప్పల తక్కెడ, వానరసేన వంటి కాంగ్రెస్ పార్టీని వెంటపెట్టుకొని సుశిక్షిత సైన్యం కలిగిన బీఆర్ఎస్ పార్టీపై దండయాత్రకి సిద్ధమయ్యారు.
అపర చాణక్యుడు, చేతిలో అపరిమిత అధికారం, యంత్రాంగం కలిగిన కేసీఆర్ని ఓడించి రేవంత్ రెడ్డి తన సత్తా చాటుకున్నారు.
ఆ తర్వాత కూడా బొటాబొటి మెజార్టీ కలిగిన రేవంత్ ప్రభుత్వం 3-6 నెలల్లో కూలిపోతుందని కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు ప్రగల్భాలు పలికితే, రెండేళ్ళు విజయవంతంగా రాష్ట్రాన్ని పాలించారు. కేసీఆర్ని ఫామ్హౌసులో నుంచి బయటకు రావాలని రోజూ సవాలు చేస్తూనే బయటకు రాలేని స్థితికి తీసుకువచ్చారు.
కనుక కేసీఆర్ తర్వాత తెలంగాణలో అంతటి రాజకీయ చతురత ఉన్న నాయకుడు రేవంత్ రెడ్డి అంటే అతిశయోక్తి కాదు.
ఏపీలో పవన్ కళ్యాణ్, నారా లోకేష్ కొట్టుకొని విడిపోతారని గోతికాడ నక్కలా వైసీపీ ఎదురుచూస్తున్నట్లే, తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వంలో సీనియర్లు తిరుగుబాటు చేసి లేదా కొట్టుకొని తమ ప్రభుత్వాన్ని కూల్చేసుకుంటారని బీఆర్ఎస్ పార్టీ ఆశగా ఎదురుచూస్తోంది.
ఏపీలో వైసీపీకి ఆ అవకాశం ఇవ్వడం లేదు కానీ తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీకి ఇప్పుడటువంటి అవకాశం ఇస్తున్నారు ఇద్దరు సీనియర్ మంత్రులు భట్టి విక్రమార్క, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.
సింగరేణి బొగ్గు గనుల విషయంలో జరుగుతున్న రాద్దాంతంతో బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వంలో సిఎం రేవంత్ రెడ్డికి, మంత్రులకు మద్య నిప్పు రాజేసేందుకు చాలా శ్రమిస్తోంది.
ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సింగరేణి బొగ్గు గనుల వ్యవహారంలోకి తనని లాగడంపై ఆంధ్రజ్యోతి వేమూరి రాధాకృష్ణపై నేడు నిప్పులు చెరిగారు. ఆయన వెనుక ఏ రాబందులు, ఏ దోపిడీదారులున్నారో అంటూ నిప్పులు చెరిగారు.
కనుక ఈ వివాదం ఇలాగే కొనసాగితే సిఎం రేవంత్ రెడ్డి ఎంతో కష్టపడి నిర్మించుకున్న కాంగ్రెస్ కోట బీటలు వారి కుప్పకూలిపోయే ప్రమాదం ఉంది.
అదే జరిగితే ‘కాంగ్రెస్ పార్టీని ఎవరూ ఓడించనవసరం లేదు. దానిని అదే ఓడించుకుంటుంది.. అప్పుడే ఇతరులు గెలుస్తుంటారనే’ నానుడి నిజమని మరోసారి నిరూపితమవుతుంది. బహుశః సిఎం రేవంత్ రెడ్డి ఈపాటికే అత్యవసరంగా నష్ట నివారణ చర్యలు చేపట్టే ఉంటారు.






