తెలంగాణ సిఎం రేవంత్ రెడ్డి బుధవారం నారాయణపేట జిల్లాలో జరిగిన ఓ కార్యక్రమంలో ఓ పెద్ద శపధం చేశారు. “నేను రాజకీయాలలో ఉన్నంత కాలం తెలంగాణలో ఎన్నటికీ కేసీఆర్ కుటుంబాన్ని, బీఆర్ఎస్ పార్టీని అధికారంలోకి రానివ్వను,” అని అన్నారు.
వచ్చే ఎన్నికలలో మా పార్టీయే గెలుస్తుందని చెప్పడం ఓ ప్రకటన మాత్రమే. కానీ మూడుకి రెండొంతుల మెజార్టీతో కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అధికారంలోకి వస్తుందని చెప్పడం, ఈ శపథం రెండూ ఆయన ఆత్మవిశ్వాసానికి నిదర్శనంగా భావించవచ్చు.
ఇలాంటి మాటలు, శపధాలు సులువే కానీ అవి సాధ్యం చేయాలంటే చాలా దూరదృష్టి, గొప్ప రాజకీయ వ్యూహాలు అవసరం.
ఏపీలో పవన్ కళ్యాణ్, తెలంగాణలో రేవంత్ రెడ్డి ఇద్దరూ శాసనసభ ఎన్నికల సమయంలో ఎట్టి పరిస్థితులలో వైసీపీ, బీఆర్ఎస్ పార్టీలను అధికారంలోకి రానీయమని నొక్కి చెప్పారు. అందుకు అనుగుణంగా వారు రకరకాల వ్యూహాలు అమలుచేస్తూ వాటిని అడ్డుకోవడమే కాక అధికారంలోకి కూడా వచ్చారు.
తెలంగాణలో లోక్సభ ఎన్నికలు జరిగినప్పుడు కూడా సిఎం రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీకి ఒక్క సీటు కూడా దక్కనీయనని శపధం చేశారు. ఆ ప్రకారమే జరిగింది. కాంగ్రెస్, బీజేపిలు చెరో 8 ఎంపీ సీట్లు గెలుచుకోగా మిగిలిన ఒక్క సీటు మజ్లీస్ గెలుచుకుంది. బీఆర్ఎస్ పార్టీకి ఒక్క సీటు కూడా రానీయకుండా చేశారు.
బీఆర్ఎస్ పార్టీకి కంచుకోట వంటి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కూడా సిఎం రేవంత్ రెడ్డి రకరకాల వ్యూహాలు అమలు చేస్తూ ఆ పార్టీని చావు దెబ్బ తీసి కాంగ్రెస్ పార్టీని గెలిపించుకున్నారు. మొన్న పంచాయితీ ఎన్నికలలో కూడా అలాంటి వ్యూహాలే రచించి రాష్ట్రంలో సగానికి పైగా పంచాయితీలను దక్కించుకున్నారు.
కనుక సిఎం రేవంత్ రెడ్డి ఏదో గొప్ప కోసం ఈ శపథం చేశారని అనుకోలేము. ఇప్పటికే ఆయన మనసులో బలమైన ప్రణాళిక, వ్యూహం ఏదో రూపుదిద్దుకుంటోంది కనుకనే ఈ శపథం చేసి ఉండవచ్చు.
ఇదివరకు ఓటుకి నోటు కేసులో కేసీఆర్ తనని జైల్లో పెట్టించినప్పుడు కూడా “ఎప్పటికైనా ఇదే జైలులో కేసీఆర్ చేత చిప్ప కూడు తినిపిస్తా. లేకుంటే నా పేరు రేవంత్ రెడ్డే కాదు,” అని శపథం చేశారు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కాగానే ఫోన్ ట్యాపింగ్, కాళేశ్వరం కేసులపై విచారణ జరిపించి సాక్ష్యాధారాలన్నీ సిద్ధం చేసుకున్నారు.
కేంద్ర ప్రభుత్వం సహకరించకపోవడం వలన ఇంతకాలం అడుగు ముందుకు వేయలేకపోయారు. కానీ ఫోన్ ట్యాపింగ్ కేసులో జనవరి 3న మొదట హరీష్ రావుకి, తర్వాత కేసీఆర్, కేటీఆర్లకు నోటీసులు ఇచ్చి విచారణకు పిలిపించబోతున్నట్లు బీఆర్ఎస్ పార్టీ నేతలే చెప్పుకున్తున్నారు. కనుక సిఎం రేవంత్ రెడ్డి కొత్త శపథం పాత శపథంతో ముడివేసి నెరవేర్చుకోబోతున్నట్లనిపిస్తోంది. అవునో కాదో 2026లో తేలిపోతుంది.






