రేవంత్ పొలిటికల్ జర్నీ…అవమానాల నుంచి అందళం వరకు

Revanth Reddy addressing public as Telangana Chief Minister with confident expression

ఒక సామాన్య రాజకీయ నాయకుడు నుంచి తెలంగాణ ముఖ్యమంత్రి స్థాయి వరకు ఎదిగిన అనుముల రేవంత్ రెడ్డి పొలిటికల్ జర్నీ నిజంగా భావితరం రాజకీయ నాయకులకు ఒక మంచి స్ఫూర్తిగా నిలుస్తుందనే చెప్పవచ్చు.

అలాగే రాజకీయాలలో ఓర్పు తో పాటుగా మొండిగా పోరాడే నేర్పు కూడా ఉండాలని అప్పుడే అనుకున్న లక్ష్యాలను అందుకుంటారని చెప్పడానికి కూడా రేవంత్ రెడ్డి రాజకీయ ప్రస్థానం ఒక చక్కటి ఉదాహరణ అవుతుంది.

ADVERTISEMENT

విద్యార్థి దశ నుండి కూడా రాజకీయాల పై ఆసక్తి కనపరిచిన రేవంత్ 2000వ సంవత్సరంలో క్రియా శీల రాజకీయాలలోకి అడుగుపెట్టారు. 2006 లో ఒక స్వంతంత్ర అభ్యర్థిగా తన రాజకీయ ప్రయాణం మొదలుపెట్టిన రేవంత్ రెడ్డి ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగా తెలంగాణ రాజకీయాలను శాసిస్తున్నారు.

ఈ మొత్తం ప్రయాణంలో రేవంత్ అనేక రాజకీయ ఎదురుదెబ్బలు తిన్నారు, అనేక వ్యక్తిగత ఇబ్బందులను ఎదుర్కొన్నారు, అలాగే పార్టీ జెండాలు కూడా మార్చారు. 2006 లో స్వతంత్ర అభ్యర్థిగా జడ్పీటీసీ ఎన్నికలలో విజయం సాధించిన రేవంత్ 2007 స్థానిక సంస్థల కోటాలో స్వతంత్ర అభ్యర్థిగా ఎమ్మెల్సీ గా ఎన్నికయ్యారు.

ఇక 2009 టీడీపీ అభ్యర్థిగా కొండగల్ నుంచి ఎమ్మెల్యే గా పోటీ చేసి తొలిసారి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో అడుగుపెట్టారు. ఇక అక్కడి నుంచి కరుడుగట్టిన టీడీపీ నాయకుడిగా, బాబు కి నమ్మిన నేతగా నిలిచిన రేవంత్ రాష్ట్ర విభజనతో రాజకీయంగా నష్టపోయారు.

అయితే 2017 లో టీడీపీ ని వీడి కాంగ్రెస్ జెండా పట్టుకుని తెలంగాణలో టీడీపీ సమాధికి, ఆయన రాజకీయ భవిష్యత్ అయోమయానికి కారణమైన కేసీఆర్ బిఆర్ఎస్ పై రాజకీయ యుద్ధం ప్రకటించారు. ఆ యుద్ధంలో రేవంత్ కేసీఆర్ ప్రభుత్వం నుంచి అనేక అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్నారు, ఓటుకి నోటు కేసులో అరెస్టయ్యి జైలుకెళ్లారు.

అయితే ఆ సమయంలో తన కుమార్తె వివాహ కార్యక్రమానికి కూడా బెయిలు మీద హాజరయ్యారు రేవంత్ రెడ్డి. తన పై రాజకీయ కక్షతోనే కేసీఆర్ ఈ రకమైన రాజకీయం చేస్తున్నారని, తానూ అనుభవించిన ఈ మానసిక క్షోభకు బదులు చెపుతా అంటూ నాటి నుంచి కేసీఆర్ పతనం కోసమే, బిఆర్ఎస్ ఓటమే లక్ష్యంగా రాజకీయం మొదలుపెట్టారు.

ఈ క్రమంలో సొంత పార్టీ లో అంతర్గత పోరాటాలు, కాంగ్రెస్ సీనియర్ నాయకుల నుంచి విమర్శలు ఇలా ఎన్నో సమస్యలతో ఇంటా బయట పోరాడి చివరికి కేసీఆర్ పదేళ్ల అధికారాన్ని, దశాబ్దం బిఆర్ఎస్ ప్రభుత్వాన్ని గద్దె దింపి అనుకున్న లక్ష్యాన్ని అందుకున్నారు. టి.కాంగ్రెస్ పార్టీలోని సీనియర్లందరి పక్కకు నెట్టి అధిష్టానం ఆశీస్సులతో తెలంగాణ ముఖ్యమంత్రిగా ఎదిగారు.

నాడు కేసులతో, అరెస్టులతో సొంత కుమార్తె వివాహం కూడా చేసుకోలేకపోయిన రేవంత్ రెడ్డి ఇప్పుడు అధికార లాంఛనాలతో కుటుంబ సమేతంగా గౌరవ మర్యాదలు అందుకుంటున్నారు. నేడు భాసర జ్ఞాన సరస్వతి ఆలయ పునరుద్ధరణ పనులకు శంకుస్థాపన చేసిన రేవంత్ తన కుటుంబంతో కలిసి మనవడి అక్షరాభ్యాస కార్యక్రమాన్ని నిర్వహించారు.

నాడు తన ఇంటి లోపలకి వచ్చి మరి అరెస్టు చేసిన పోలీస్ అధికారులు, ప్రభుత్వ యంత్రంగం మొత్తం ఇప్పుడు రేవంత్ ఆదేశాల కోసం ఎదురుచూస్తుంది. అలాగే నాడు తనను తెలంగాణ రాజకీయాల నుంచి శాశ్వతంగా తొలగిస్తాం అంటూ ప్రకటనలు చేసిన వారిని నేడు ఫామ్ హౌస్ గడప దాటకుండా చేసారు.

అయితే ఇక్కడ రేవంత్ రెడ్డి లో చెప్పుకోదగ్గ మరో అంశం రేవంత్ తన రాజకీయ అవసరాల నిమిత్తం పార్టీ మారినప్పటికీ ఇప్పటికి టీడీపీ పార్టీ మీద ఆ పార్టీ అధినేత బాబు పైన అదే గౌరవ మర్యాదలను కనపరుస్తున్నారు. ఈ ఒక్క లక్షణమే ఇప్పటికి టీడీపీ క్యాడర్ లో రేవంత్ మనవాడే అనే బలమైన ముద్రను వేయగలిగింది.

ADVERTISEMENT
Latest Stories