ప్రత్యేక తెలంగాణ సాధన తరువాత వరుసగా పదేళ్ల పాటు ఓటమి తప్ప గెలుపు రుచి చూడని కాంగ్రెస్ చేతికి అధికారం అనే ఆయుధాన్ని, ప్రభుత్వం అనే అందలాన్ని అందించిన కాంగ్రెస్ యువ నాయకుడు రేవంత్ రెడ్డి.
పదేళ్ల కాంగ్రెస్ ప్రతిపక్ష పాత్రకు ఒక ముగింపు పలికి బిఆర్ఎస్ ఏకచక్రాధిపత్యానికి చరమ గీతం పాడిన రేవంత్ కాంగ్రెస్ అధిష్టానం మెప్పు పొందారు. దాని ఫలితమే టీడీపీ డీఎన్ఏ గా ఉన్న రేవంత్ కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా పట్టాభిషేకం పొందారు.
2023 సార్వత్రిక ఎన్నికలలో కాంగ్రెస్ గెలుపు రేవంత్ ను తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో కూర్చోబెట్టింది, అలాగే కాంగ్రెస్ పార్టీలోని సీనియర్ నాయకులందరినీ ఒకే తాటి మీదకు రప్పించింది.
ఇక ఇప్పుడు జూబ్లీహిల్స్ బిఆర్ఎస్ సిట్టింగ్ స్తానం లో కాంగ్రెస్ జయకేతనం కాంగ్రెస్ లో రేవంత్ ను తిరుగులేని నాయకుడిగా మార్చింది. గత కొన్ని రోజులుగా కాంగ్రెస్ లో గ్రూప్ రాజకీయాలు రేవంత్ ను టార్గెట్ చేయడానికి సిద్దమవుతున్న వేల ఈ ఉపఎన్నికల గెలుపు వారి నోటికి తాళం వేసినట్టయ్యాయి.
కోటమరెడ్డి రాజగోపాల్ రెడ్డి వంటి అసమ్మతి నేతల గళాన్ని రేవంత్ ఈ ఉపఎన్నికల గెలుపుతో కట్టడి చేయగలిగారు. అలాగే ఇంకొంతమంది తెరవెనుక రాజకీయం నడుపుతూ రేవంత్ పై కాంగ్రెస్ అధిష్టానానికి ఫిర్యాదులు చెయ్యాలని భావించిన కాంగ్రెస్ నాయకులకు ఇప్పుడా అవకాశం లేకుండా చేసారు.
ఒకే ఒక్క గెలుపుతో ఏకంగా రాష్ట్ర సీఎం హోదాలో కూర్చున్న రేవంత్ ఇక ఇప్పుడు తనదు కాదు అనుకున్న జూబ్లీహిల్స్ స్థానాన్ని సైతం కాంగ్రెస్ హస్తగతం చేయడంతో ఒక్కో గెలుపు ఇటు ప్రత్యక్షంగా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చెయ్యడంతో పాటుగా మరోపక్క రేవంత్ నాయకత్వాన్ని కూడా పరోక్షంగా బలపరుస్తుంది.
దీనితో రేవంత్ రాజకీయం చాప కింద నీరు మాదిరి అటు కాంగ్రెస్ లో ఇటు తెలంగాణ రాజకీయాలలో స్థిరంగా విస్తరిస్తున్నట్టు కనిపిస్తుంది.






