జాతిపితకు సరైనోడే దొరికాడుగా!

Revanth Reddy vs KCR

తెలంగాణ ఉద్యమ సమయం నుంచే కేసీఆర్‌ ప్రజలలో సెంటిమెంట్ రాజేయడం మొదలుపెట్టారు. తెలంగాణ సాధనకు అది చాలా అవసరం కూడా. కానీ తెలంగాణ ఏర్పడిన 12 ఏళ్ళ తర్వాత కూడా నేటికీ బీఆర్ఎస్‌ పార్టీ కేసీఆర్‌ తయారు చేసి ఇచ్చిన ఆ శక్తివంతమైన అస్త్రాన్ని చక్కగా వాడుకుంటూనే ఉంది. దాంతో తెలంగాణ రాజకీయాలలో పైచేయి సాధిస్తూనే ఉంది.

శాసనసభ సమావేశాలకు, ప్రజల మధ్యకు రాకుండా ఫామ్‌హౌసులో కాలక్షేపం చేస్తున్నందుకు ప్రజలకు సంజాయిషీ ఇచ్చుకొని, క్షమాపణలు చెప్పుకోవలసిన కేసీఆర్‌ అటెండెన్స్ వేసుకోవడానికి శాసనసభకి వస్తే గుమ్మడి కాయతో దిష్టి తీయించుకుంటారు.

ADVERTISEMENT

ఫోన్ ట్యాపింగ్‌ వంటి తీవ్రమైన కేసులో సిట్‌ అధికారులు నోటీస్ ఇచ్చి ఆయన సొంత ఇంట్లోనే విచారణ జరిపితే “తెలంగాణ జాతిపితకే నోటీసులా? ఇంత అవమానమా?” అంటూ తనని తాను ప్రమోట్ చేసుకుంటూ, ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తుంటారు.

ఇస్రో శాస్త్రవేత్తలు ఉపగ్రహాలను ఎంత ఖచితత్వంతో నిర్దిష్ట కక్ష్యలో ప్రవేశపెడుతుంటారో, అంతే ఖచితత్వంతో కేసీఆర్‌ ఫామ్‌హౌసు వ్యూహాలని బీఆర్ఎస్‌ పార్టీ అమలు చేస్తుంటుంది.

అలాంటి సుశిక్షితమైన, అత్యంత ప్రణాళికాబద్దంగా పనిచేస్తున్న బీఆర్ఎస్‌ పార్టీని ఎదుర్కోవాలంటే కేసీఆర్‌ని మించిన ఘనుడికే సాధ్యం. కాంగ్రెస్‌ పార్టీ, ప్రభుత్వంలో అలాంటి ఘనుడు ఎవరు? అంటే సిఎం రేవంత్ రెడ్డే… అంటే అతిశయోక్తి కాదు.

బుధవారం నల్గొండ జిల్లాలో మున్సిపల్ ఎన్నికల ప్రచార సభలో సిఎం రేవంత్ రెడ్డి వేసిన చురకలే ఇందుకు చక్కటి నిదర్శనం.

ఆయన ఏమన్నారంటే, “అన్నం తినేవారు ఎవరూ కూడా మొగుడు పెళ్ళాలు ఏం మాట్లాడుకుంటున్నారో చాటుగా వినరు. కానీ ఈ కేసీఆర్‌ అలా విన్నారు.

రాష్ట్రంలో అధికార, ప్రతిపక్షాల నేతలు, న్యాయమూర్తులు, జర్నలిస్టులు, చివరికి వ్యాపారులు, సినీ నటీనటుల ఫోన్లు కూడా దొంగచాటుగా వింటూ బ్లాక్ మెయిల్ రాజకీయాలు చేశారు.

మన తెలంగాణ పోలీసులు చాలా మంచివాళ్ళు కనుక అలాంటి హేయమైన నేరానికి పాల్పడిన కేసీఆర్‌ని కూడా చాలా మర్యాదపూర్వకంగా విచారించారు. కానీ వారు ఆయనకు నోటీస్ ఇస్తే, తెలంగాణ జాతిపితకు నోటీస్ ఇచ్చారని, తెలంగాణ ఆత్మగౌరవాన్ని దెబ్బ తీశారని బీఆర్ఎస్‌ పార్టీ ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నం చేసింది.

ఒకవేళ బీఆర్ఎస్‌ వాదన ప్రకారమే ఆయన ‘తెలంగాణ జాతిపిత’ అయితే, ఆయనకు నోటీస్ ఇస్తే తెలంగాణ ప్రజలందరికీ ఇచ్చిన్నట్లే అనుకుంటే, మరి కేసీఆర్‌తో సహా ఆయన కుటుంబ సభ్యులు పోగేసుకున్న వందలు వేల ఎకరాలు, వాటిలో వారు నిర్మించుకున్న ఫామ్‌హౌసులు కూడా ప్రజలకే చెందాలి కదా? రాసి ఇచ్చేస్తారా?

బీఆర్ఎస్‌ పార్టీ వాళ్ళు ఎంత అవినీతికి పాల్పడి, ఎన్ని వేలకోట్ల ఆస్తులు పోగేసుకున్నా క్షమించవచ్చు. కానీ మొగుడు పెళ్ళాలు మాట్లాడుకుంటే మాటలను చాటుగా వినేవారిని క్షమించగలమా?అలాంటి హేయమైన నేరం చేసిన వ్యక్తి తెలంగాణ జాతిపిత ఎలా అవుతారు? ప్రజలందరూ బాగా ఆలోచించాలి,” అని సిఎం రేవంత్ రెడ్డి అన్నారు.

ADVERTISEMENT
Latest Stories