తెలంగాణ సిఎం రేవంత్ రెడ్డి, మాజీ సిఎం కేసీఆర్ ఇద్దరూ సోమవారం సాయంత్రం వేర్వేరు ప్రాంతాలలో భారీ బహిరంగ సభలు నిర్వహించారు. ఇద్దరి ప్రసంగాలలో రెండు కామన్ పాయింట్స్ ఉన్నాయి. 1. ఎదుటవాడి పాలన అత్యంత నికృష్టం. తమది అద్భుతమైన పాలన. 2. వచ్చే ఎన్నికలలో గెలిచి మళ్ళీ మేమే అధికారంలో వస్తాము.
ఈ రెండు పాయింట్లతో వారేమి చెప్పుకున్నారో ఇప్పటికే ప్రసార మాధ్యమాల ద్వారా అందరికీ తెలిసే ఉంటుంది. ఒకవేళ తెలియకపోయినా అవన్నీ రోజూ వింటున్నవే కనుక వాటిని పట్టించుకోనవసరం లేదు.
సిఎం రేవంత్ రెడ్డి సభకి నిర్దిష్టమైన లక్ష్యం ఉంది. పదవి, అధికారం ఉంటేనే కేసీఆర్ ప్రజలకు కనిపిస్తారు శాసనసభకు వస్తారు లేకుంటే కనబడరు రారని చెప్పాలనుకున్నారు చెప్పారు.
కాళేశ్వరం ఇంజనీరింగ్ అద్భుతం కాదని అదొక అతి పెద్ద మానవ (కేసీఆర్) తప్పిదమని, మేడిగడ్డ బ్యారేజ్లో క్రుంగిపోయిన పిల్లర్లే ఇందుకు సాక్ష్యమని రేవంత్ రెడ్డి చెప్పిన మాటలు ప్రజలకు, ముఖ్యంగా రైతులకు సరిగ్గా చేరుతుంది.
అహంకారంతో మిడిసిపడుతూ, అవినీతికి పాల్పడినందుకే ప్రజలు గద్దె దించినా కేసీఆర్, బీఆర్ఎస్ నేతలలో ఇంకా ఆ అహంకారం ఏ మాత్రం తగ్గలేదని, ప్రజలెన్నుకున్న తమ ప్రభుత్వం పోవాలని, కూలిపోవాలని కోరుకోవడమే ఇందుకు సాక్ష్యమనే రేవంత్ రెడ్డి వాదనతో ప్రజలు ఏకీభవించకుండా ఉండరు.
గత ఎన్నికల సమయంలో బీఆర్ఎస్ పార్టీని ఓడగొడతాను. కేసీఆర్ని జైలుకి పంపిస్తానని సిఎం రేవంత్ రెడ్డి శపథం చేశారు. దానిలో మొదటి శపథం నెరవేర్చాను కేంద్రం అడ్డుపడకపోతే త్వరలో రెండోది నెరవేర్చుతానని ఈ సభలో చెప్పారు.
నేను రాజకీయాలలో ఉన్నంత వరకు బీఆర్ఎస్ పార్టీని, కేసీఆర్ని మళ్ళీ అధికారంలోకి రానీయనని సిఎం రేవంత్ రెడ్డి ఇది వరకే శపథం చేశారు.
నిన్న సభలో ఈసారి బీఆర్ఎస్ పార్టీకి ప్రతిపక్ష పార్టీ హోదా కూడా దక్కనీయనని ప్రజలు, కార్యకర్తల సాక్షిగా సిఎం రేవంత్ రెడ్డి శపథం చేశారు.
కేసీఆర్ పంచన చేరిన జీవన్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీ ఎన్నిసార్లు పదవులు ఇచ్చి ఎంతగా గౌరవించిందో వివరించారు. కానీ జీవన్ రెడ్డి కాంగ్రెస్ కార్యకర్తలని కూడా ఎదగనీయకుండా తొక్కేశారని, పదవీ లాలసతోనే కేసీఆర్ పంచన చేరారని సిఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.
కనుక సిఎం రేవంత్ రెడ్డి ఈ సభ ద్వారా కేసీఆర్కి గట్టి హెచ్చరికలు పంపుతూనే, తన పాలనపై బీఆర్ఎస్ పార్టీ చేస్తున్న దుష్ప్రచారానికి చెక్ పెట్టే ప్రయత్నం చేసినట్లు అర్ధమవుతోంది. ముఖ్యంగా పార్టీ శ్రేణులకు, ప్రజలకు తన ప్రభుత్వంపై నమ్మకం పెరిగేలా సిఎం రేవంత్ రెడ్డి ప్రసంగం సాగింది. కనుక సభ ప్రయోజనం నెరవేరినట్లే!




