పరీక్ష ఫెయిల్ అయితే ఆత్మహత్య! మార్కులు తక్కువొస్తే ఆత్మహత్య! పెళ్ళికాకపోతే ఆత్మహత్య! పెళ్ళి చేసుకున్నాక విభేదాలొస్తే ఆత్మహత్య! అనారోగ్యం వేధిస్తుంటే ఆత్మహత్య! చివరికి సెల్ ఫోన్, బైక్ కొనివ్వకపోయినా ఆత్మహత్య!
ఆ సెల్ ఫోన్ అతిగా వదోద్దంటే ఆత్మహత్య! అదే సెల్ ఫోన్లో ఎవరైనా వేధిస్తే ఆత్మహత్య! ఆత్మహత్యకు ఇన్ని కారణాలున్నాయా? అని ఆశ్చర్యం కలుగుతుంది. ప్రతి చిన్న సమస్య ప్రాణాంతక నిర్ణయంగా మారుతున్న పరిస్థితి ఆందోళన కలిగిస్తుంది.
ఒకప్పుడు చిన్న సమస్యలను ఎవరూ పట్టించుకునేవారు కాదు. పెద్ద సమస్యలను మౌనంగా భరిస్తుండేవారు. కానీ ఇలా ఆత్మహత్యలు చేసుకునేవారు కారు. అంటే ఇప్పటి తరం కంటే మునుపటి తరానికి మనోధైర్యం ఎక్కువగా ఉందా అనే ప్రశ్న తలెత్తుతుంది.
అయితే అప్పటి తరం కంటే ఇప్పటి తరమే చాలా తెలివైనదిగా భావిస్తాం. సమాచార సాంకేతికత, అవకాశాలు పెరిగాయి. అయినా ఈ మానసిక దౌర్భల్యం ఎందుకు పెరుగుతోంది? తెలివితేటలు ఉన్నా సహనశక్తి ఎందుకు తగ్గుతోంది అనే సందేహం మిగులుతోంది.
ఎవరి శరీరం, ఎవరి ప్రాణం వారిష్టం అని సరిపెట్టుకున్నా, కొన్ని ఘటనలు హద్దులు దాటుతున్నాయి. పిల్లలను తల్లిదండ్రులు, తల్లిదండ్రులను పిల్లలు, అక్రమ సంబంధాలకు అడ్డొస్తున్నారనో, ఆస్తుల కోసమో హత్యలు చేస్తున్నారు.
భర్తను భార్య, భార్యను భర్త, తల్లిదండ్రులను పిల్లలు చంపేస్తున్న ఘటనలు కూడా వెలుగుచూస్తున్నాయి. కొందరు ముందుగా బీమా పాలసీలు చేయించి మరీ హత్యలకు పాల్పడటం ఈ ధోరణి ఎంత ప్రమాదకరంగా మారిందో చెబుతుంది.
ప్రపంచంలోని పలుదేశాల్లో ఇటువంటి విపరీత ధోరణులు కనిపిస్తున్నాయి. ఒకరినొకరు తిట్టుకోవడం, కొట్టుకోవడం నుంచి ఒకరినొకరు చంపుకునే దశకు మానవ జాతి చేరుకుందా? అనే భయానక ప్రశ్న తలెత్తుతుంది.
ఈ హత్యలు, ఆత్మహత్యల విపరీత పోకడలను ప్రభుత్వం, సమాజం, కుటుంబం ఎవరూ పెద్ద మార్పుగా భావించడం లేదు. ఎవరి ప్రాధాన్యతలు, ఆసక్తులు వారికున్నాయి. ఇలాంటి అంశాలపై ఆలోచించేందుకు ఎవరికీ తీరిక లేదు.
భారతీయ సమాజంలో చాప కింద నీరులా వ్యాపిస్తున్న ఈ అవాంఛిత ధోరణులను కట్టడి చేయకపోతే మున్ముందు పరిస్థితి మరింత భయంకరంగా మారే ప్రమాదం ఉంది. ప్రభుత్వాలు, పెద్దలు, ఉపాధ్యాయులు, మేధావులు ఇప్పటికైనా స్పందించాల్సిన అవసరం ఉంది.






