హత్యా రాజకీయాలు… ‘గొట్టిపాటి’ వర్సెస్ ‘కరణం’

ప్రకాశం జిల్లా బల్లికురవ మండలంలోని వేమవరంలో శుక్రవారం రాత్రి జరిగిన హత్యలపై ఎమ్మెల్సీ కరణం బలరాం స్పందించారు. ప్రశాంతంగా ఉన్న ఊరిలో ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ చిచ్చుపెట్టాడని తీవ్ర ఆరోపణలు చేసారు. తాము సంయమనం పాటిస్తున్నా, ఆయన మాత్రం రెచ్చగొడుతూనే ఉన్నారని, పార్టీలోని సీనియర్ నేతల పట్ల అడ్డగోలుగా వ్యవహరిస్తే చూస్తూ ఊరుకునేది లేదని, కార్యకర్తలు ఆయన తీరును జీర్ణించుకోలేకపోతున్నారని హెచ్చరికలు జారీ చేసారు.

ADVERTISEMENT

దీంతో ఎమ్మెల్సీ కరణం బలరాం – ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ వర్గాల మధ్య జరుగుతున్న ఘర్షణ నేపథ్యంలో బల్లికురవ మండలం వేమవరం గ్రామంలో 144 సెక్షన్ విధించారు. గత 10 రోజుల నుంచి గొట్టిపాటి చేస్తున్న చేష్టల ఫలితమే ఇదని, గొట్టిపాటి ఓ నపుంసకుడు అని, ఓ క్రిమినల్ అని, సొంత అన్నపైనే పోటీ చేసిన సన్నాసి అని, ఎలాంటి సిద్ధాంతాలు లేని వ్యక్తి అని మండిపడ్డారు. ఇలాంటి వ్యక్తులను పార్టీలో చేర్చుకున్నందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

ఆయనలా కక్కుర్తి పనులు చేయడం, ఆఫీసర్లను ట్రాన్స్ ఫర్ చేసి పబ్బం గడుపుకునే తత్వం తనది కాదని అన్నారు. ఉన్నతాధికారుల సహాయంతో నియోజకవర్గానికి మేలు చేయడం మాత్రమే తనకు తెలుసని… గొట్టపాటిలా నీచమైన రాజకీయాలు చేయడం తనకు తెలియదని, గొట్టిపాటి బతుకే అబద్ధాల బతుకని ఎద్దేవా చేశారు. తల్లికి కుమారుడికి, నాయనమ్మకు మనవడికి, బాబాయ్ కి కొడుకుకి మధ్య తగాదాలు వచ్చేలా చేసని నీచుడు గొట్టిపాటి అని, తన గురించి మాట్లాడే నైతికత కూడా లేదని ధ్వజమెత్తారు.

అయితే ఈ ఆరోపణలను గొట్టిపాటి ఖండించారు. ఇప్పటి దాకా మూడుసార్లు తాను ఎమ్మెల్యే అయ్యాయని… ఇలాంటి హత్యా రాజకీయాలను ప్రోత్సహించాల్సిన అవసరం తనకు గాని, తన కుటుంబానికి కాని ఎప్పుడూ లేదని అన్నారు. గ్రామంలో పాత కక్షల నేపథ్యంలో జరిగిన దాడులను తీసుకొచ్చి తమ మీద రుద్దడం మంచి పద్ధతి కాదని, తాము మర్డర్లు చేస్తామా? లేదా? అనే విషయం అందరికి తెలిసిందేనని… తమపై అనవసరంగా నిందలు వేయడం తగదని సూచించారు. ముఖ్యమంత్రి చంద్రబాబును కలుస్తానని… జరిగిన విషయం మొత్తాన్ని ఆయన దృష్టికి తీసుకు వెళ్తానని తెలిపారు.

ADVERTISEMENT
Latest Stories