ఒక్కో సమయంలో ఒక్కో అంశం, సమస్య లేదా వ్యక్తుల చుట్టూ మీడియా తిరుగుతూ ఉంటుంది. తిరుమల కల్తీ నెయ్యి వ్యవహారం బయటపడిన తర్వాత దాదాపు నెలరోజులు ఆవార్తలే మారుమ్రోగిపోయాయి. సర్వత్రా అదే అంశంపై ప్రజలు కూడా చర్చించుకున్నారు.
ఆ తర్వాత పవన్ కళ్యాణ్ సనాతనధర్మంతో అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. ముఖ్యంగా ప్రకాష్ రాజ్ దృష్టిని మరీ ఎక్కువగా ఆకర్షిస్తుండటంతో ఆయన జస్ట్ ఆస్కింగ్ అంటూ ‘ఎంజీఆర్ మీద హటాత్తుగా ఇంత ప్రేమ పుట్టుకొచ్చేసింది… పైనుంచి ఏమైనా ఆదేశాలు వచ్చాయా?” అంటూ ట్విట్టర్లో సన్నాయి నొక్కులు నొక్కారు.
అంతకు ముందు వైసీపి ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్-మాధూరీల రసవత్తరమైన స్టోరీ బాగా హైలైట్ అయ్యింది. విజయవాడ వరదలు, కల్తీ నెయ్యిలో మీడియా, ప్రజలు మునిగితేలుతుండటంతో, అందరూ మా గురించి మరిచిపోయారా ఏమిటి? అని జ్ఞాపకం చేసేందుకు అన్నట్లు దువ్వాడ శ్రీనివాస్-మాధూరీ ఇద్దరూ సోమవారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. వారిరువురూ తిరుమల వచ్చిన భక్తులనే కాదు… యావత్ రాష్ట్ర ప్రజల దృష్టి ఆకర్షించారు.
వారిరువురూ భార్యాభర్తలు కారు. ఇరువురికీ వేర్వేరు సంసారాలున్నాయి. వారి జీవిత భాగస్వాములతో వారింకా విడాకులు తీసుకోలేదు. ‘సహజీవనం’ అనే అందమైన ముసుగు తొడిగేందుకు కూడా లేకుండా తామిద్దరి మద్య శారీరిక (అక్రమ) సంబంధం ఉందని ఆమె స్వయంగా చెప్పుకున్నారు.
అటువంటివారిని పవిత్రమైన తిరుమల శ్రీవారి ఆలయంలోకి అనుమతించవచ్చా లేదా?అనేది పండితులే చెప్పాలి. అటువంటి జంటల నుంచి కూడా డిక్లరేషన్ తీసుకువాలనే నిబంధన అవసరమా కాదా? అనేది టీటీడీ చెప్పాలి. ఇది కూడా జగన్ డైవర్షన్ పాలిటిక్స్లో భాగమేనా? ఒకవేళ అయితే దీంతో జగన్ ఏమి సాధించాలనుకుంటున్నారు?అనే ప్రశ్నలకు కాలం సమాధానం చెపుతుంది.
ఏది ఏమైనప్పటికీ అంతా చల్లబడుతోందనుకునే సమయంలో వైసీపి ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్, మాధూరిని వెంటబెట్టుకొని తిరుమల శ్రీవారి దర్శనానికికి రావడం యాదృచ్చికమని అనిపించడం లేదు.




