‘చిత్రం, నువ్వు నేను, మనసంతా నువ్వే’ వంటి వరుస హిట్లతో ఒక్కసారిగా టాలీవుడ్ లో సంచలన సంగీత దర్శకుడిగా మారిన ఆర్పీ పట్నాయక్ అన్న పేరు ప్రేక్షకులకు పరిచయం చేయాల్సిన పని లేదు. అయితే అంతటి వెలుగు వెలిగిన ఆర్పీ పట్నాయక్ ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటున్నారు. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే సంగీతానికి దూరంగా జరిగారు. అవకాశం వస్తే సినిమాలకు దర్శకత్వం వహిస్తాను గానీ, సంగీతం చేసే ఉద్దేశం మాత్రం లేదని స్పష్టంగా చెప్తున్నారు. మరి అంతటి నిర్ణయం తీసుకోవడానికి బలమైన కారణం ఏంటి? అంటే… కింగ్ నాగార్జున నటించిన “నేనున్నాను” సినిమానే తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో స్పష్టం చేసారు ఆర్పీ.
రామానాయుడు స్టూడియోలో ‘నేనున్నాను’ పాటలను రికార్డ్ చేస్తుండగా, వెనుక నుండి ఓ పెద్దాయన వచ్చి, మీరు సంగీత దర్శకుడిగా ఉండడం వలన ఈ సినిమా మార్కెట్ అవ్వడం లేదు అని చెప్పడంతో తాను బాగా హర్ట్ అయిన మాట వాస్తవమేనని, అందుకే ఇక నుండి సినిమాలకు సంగీతం అందివ్వకూడదని నిర్ణయించుకున్నానని తెలిపారు. తన వలన సినీ నిర్మాతలు ఇబ్బంది పడకూడదు, అతను చేసిన వ్యాఖ్యలు నిజమే అనుకుంటే, ఎంత మంది నిర్మాతలు ఇబ్బంది పడతారో అని సంగీతం నుండి రిటైర్మెంట్ తీసుకుంటున్నట్లుగా తెలిపానని పట్నాయక్ వివరించారు. అయితే ఇదే సమయంలో ఈ ఉదంతంతో నాగార్జున గారికి ఏ మాత్రం సంబంధం లేదని ఒకటికి, రెండు సార్లు నొక్కివక్కానించి మరీ చెప్పారు.
నాగార్జునను చాలా సందర్భాలలో కలిసానని, ఎప్పుడూ బాగా పలకరించారని, అలాగే తర్వాత తాను కంపోజ్ చేసిన ఓ పాటలో కూడా నటించారని వివాదానికి అవకాశం ఇవ్వకుండా చెప్పారు. పవన్ కళ్యాణ్ తో ‘గుడుంబా శంకర్’ సినిమా అవకాశం వచ్చిన మాట నిజమేనని, కానీ అప్పుడే యుఎస్ ట్రిప్ ఉండడంతో ఆ సినిమా చేయడం కుదరలేదని, ఒక నెల రోజుల పాటు పవన్ కళ్యాణ్ సినిమాను వాయిదా వేయమని చెప్పడం సాధ్యం కాని విషయమని, అయితే భవిష్యత్తులో అవకాశం వస్తే మాత్రం పవన్ సినిమాకు సంగీతం అందించాలన్న అభిలాష ఉందని అన్నారు ఆర్పీ. ఎందుకంటే… పవన్ అంత నిర్మలమైన మనసే తన సంగీతంలో ఉంటుందని, అందుకే పవన్ సినిమాలకు సంగీతం అందించాలని ఉందని అన్నారు పట్నాయక్.



