చిత్రం, నువ్వు నేను, మనసంతా నువ్వే… తొలి మూడు చిత్రాలు కూడా 175 రోజులు. సినీ ఇండస్ట్రీలో మహామహా సినీ వారసులకు కూడా దక్కలేనటువంటి రికార్డులు ఇవి. ఎక్కడి నుండో అనామక హీరోగా ఇండస్ట్రీకి వచ్చిన ఉదయ్ కిరణ్ అనే ఓ సాధారణ వ్యక్తికి ఈ అరుదైన ఘనత సొంతం అయ్యింది. సక్సెస్ వెంటే ఉండే సినీ ఇండస్ట్రీలో ఉదయ్ కిరణ్ పేరు మారుమ్రోగిపోయింది. ఎంతలా అంటే… ఏకంగా మెగాస్టార్ చిరంజీవి తనయురాలినే వివాహం చేసుకునే రేంజ్ కు ఉదయ్ కిరణ్ ఎదిగాడు. ఇదంతా అందరికీ తెలిసిన విషయమే. అయితే అక్కడ నుండి ఒక్కసారిగా కిందికి పడిపోయిన ఉదయ్ కిరణ్, కొన్నాళ్ళకు శాశ్వతంగా అందరికీ దూరమయ్యాడు.
ఉదయ్ కిరణ్ మరణించిన సందర్భంలో ‘మెగా ఫ్యామిలీ’పై వెలువడిన ఆరోపణలు ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. చిరు కూతురితో వివాహం ఫిక్స్ కావడం, ఆ తర్వాత కాన్సిల్ కావడమే ఉదయ్ జీవితాన్ని మలుపు తిప్పిందన్న ప్రచారం బలంగా జరిగింది. అయితే వాస్తవం ఏమిటన్నది అనంత లోకాలకు వెళ్ళిపోయిన ఉదయ్ కిరణ్ కు, మెగా కుటుంబ సభ్యులకు మరియు ఆ భగవంతునికే తెలియాలి. కానీ ఆరోపణలు మాత్రం మెగా ఫ్యామిలీపై ఇప్పటికీ వ్యక్తమవుతూనే ఉంటాయి. ఉదయ్ కిరణ్ తో పాటే ఇండస్ట్రీకి పరిచయం అయిన సంగీత దర్శకుడు ఆర్పీ పట్నాయక్ ఈ అంశంపై తాజాగా స్పందించారు.
ఉదయ్ కిరణ్ హీరోగా నటించిన “ఔనన్నా.. కాదన్నా…” సినిమాను టార్గెట్ చేసిన మెగా ఫ్యామిలీ సభ్యులు, దీనిని త్వరగా విడుదల కాకుండా చేసారంటూ వెల్లువెత్తిన ఆరోపణల్లో నిజం లేదని, గతంలో తానెప్పుడూ ఈ వ్యాఖ్యలు చేయలేదని, నిజానికి ఆ సినిమా అనుకున్న సమయానికే విడుదలైందని తెలిపారు. అయితే అసలు ఉదయ్ కిరణ్ – మెగా ఫ్యామిలీ మధ్య ఏం జరిగిందన్నది మాకేవరికీ తెలియదని, వారి మధ్య జరిగిన విషయాలపై కామెంట్ చేసే హక్కు నాతో సహా ఎవరికీ లేదని ఆర్పీ పట్నాయక్ స్పష్టం చేసారు. భవిష్యత్తులో కూడా ఈ అంశంపై మాట్లాడే అధికారం, హక్కు లేవని, నేనెప్పుడూ అలా మాట్లాడబోనని తెలిపారు ఆర్పీ.



