బంధువులకు కాంట్రాక్టులు ఇప్పించుకొనేందుకు లేదా పార్టీ టికెట్లు, పదవుల కోసం పైరవీలు చేసే రాజకీయనాయకులు, సీబీఐ, ఈడీ కేసులలో చిక్కుకొంటే వారితో తమకు ఎటువంటి సంబందమూ లేదని వాదించడం మొదలుపెడతారు. లేదా కులం ప్రస్తావన తెచ్చి మాట్లాడుతుంటారు. వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి అల్లుడికి అన్నగారైన శరత్ చంద్ర రెడ్డిని ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో నిన్న ఈడీ అధికారులు అరెస్ట్ చేసినప్పుడు, టిడిపి నేతలు వెంటనే సోషల్ మీడియాలో విజయసాయిని నిలదీస్తూ ప్రశ్నించడం మొదలుపెట్టారు. మీడియాలో కూడా ఈ వార్త ప్రముఖంగా రావడంతో వైసీపీ నష్టనివారణ చర్యలు చేపట్టింది. ఇటువంటి సందర్భాలలో వివరణలు ఇచ్చేందుకే సజ్జల రామకృష్ణారెడ్డిని వైసీపీ ప్రభుత్వం మీడియా సలహాదారుగా నియమించుకొందో ఏమో తెలీదు కానీ ఆయన వివరణ ఇచ్చారు.
“అరబిందో గ్రూప్ కంపెనీ వేలకోట్లు బిజినెస్ చేస్తుంటుంది. దాని డైరెక్టర్ శరత్ చంద్ర రెడ్డి మా ఎంపీ విజయసాయి రెడ్డికి అల్లుడు కాదు. అల్లుడి అన్న. ఆయన ఏం వ్యాపారాలు చేస్తున్నారో, ఎంత సంపాదించుకొంటున్నారో వాటితో విజయసాయి రెడ్డికి ఎటువంటి సంబంధమూ లేదు. అలాగే ఢిల్లీ లిక్కర్ స్కామ్తో మాకు, మా ప్రభుత్వానికి, మా పార్టీకి ఎటువంటి సంబందామూ లేదు. కేవలం విజయసాయి రెడ్డికి బంధువు అనే సాకుతో బోడి గుండుకీ మోకాలుకి మూడేసేందుకు టిడిపి నేతలు ప్రయత్నిస్తున్నారు. కడప యూనివర్సిటీలో వేమన విగ్రహాన్ని ప్రధాన ద్వారం వద్ద అందరికీ కనబడేలా ఏర్పాటు చేస్తే వేమన విగ్రహం తొలగించి వైఎస్సార్ విగ్రహం పెట్టామంటూ దుష్ప్రచారం చేస్తున్నారు. టిడిపి, జనసేనలకు మాపై పోరాడేందుకు వేరే ఏ అంశం లేకపోవడంతో విజయసాయి రెడ్డిని టార్గెట్ చేసుకొని విమర్శిస్తున్నాయి. ఇప్పటం గ్రామంలో పవన్, లోకేశ్ డ్రామాలు కూడా అందుకే. ఏమీ లేకపోయినా ఏదో ఘోరం జరిగిపోతోందన్నట్లు టిడిపి, జనసేనలు, వాటి అనుకూల పత్రికలు గోలగోల చేస్తూ మా ప్రభుత్వంపై బురదజల్లాలని విశ్వప్రయత్నాలు చేస్తున్నాయి. కానీ రాష్ట్ర ప్రజలకు తెలుసు మా ప్రభుత్వం ఎటువంటిదో?కనుక టిడిపి, జనసేనల కాకిగోలని మేము పట్టించుకోనవసరం లేదు,” అని సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు.
అసలు లేని సమస్యను సృష్టించే అలవాటు వైసీపీ ప్రభుత్వానికే ఉందని చెప్పకతప్పదు. మూడు రాజధానుల ప్రతిపాదన, పోలవరం రివర్స్ టెండరింగ్, సచివాలయాలకు వైసీపీ రంగులు, సినిమా టికెట్ ధరల నియంత్రణ, ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పు, విగ్రహాలు, ఇళ్ళు కూల్చివేతలు… ఇలా చెప్పుకొంటూపోతే ఆ జాబితాకు అంతే ఉండదు. శరత్ చంద్ర రెడ్డితో వైసీపీ నేతలకు ఎటువంటి సంబందాలున్నాయో అందరికీ తెలుసు. గుమ్మడి కాయల దొంగ అంటే భుజాలు తడుముకొన్నట్లు ఈడీ అధికారులు ఆయనని అరెస్ట్ చేస్తే వైసీపీ నేతలు ఎందుకు కంగారు పడుతున్నారు?అని ఏపీ బిజెపి నేతలు ప్రశ్నిస్తున్నారు కదా? వారి మాటలకు అర్దం ఏమిటి? సజ్జల రామకృష్ణారెడ్డి వివరిస్తే బాగుంటుంది.



