భవిష్యత్తులో జగన్ ఎంత స్థాయికి వెళ్తారాన్నది ఇప్పుడే తెలియదు గానీ… బహుశా తను అనుకున్నట్లు ముఖ్యమంత్రి స్థాయికి వెళ్ళినా గానీ, చెరిగిపోని మచ్చలకు నిలయంగా జగన్ నిలిచిపోతారని పలు సంఘటనలు చెప్తున్నాయి. తన తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి చనిపోయినపుడు సంతకాల సేకరణ చేపట్టిన అంశం ఎప్పటికీ ప్రత్యర్ధి పార్టీలకు ‘బ్రహ్మాస్త్రం’లా ఉపయోగపడుతోంది. ఆ తర్వాత జరిగిన పలు విషయాలలో కూడా ‘శవ రాజకీయాలు’ జగన్ చేస్తున్నారన్న ఆరోపణలను తెలుగుదేశం పార్టీ ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లగలిగింది.
అయితే ఇందులో నుండి బయటపడాల్సింది పోయి, అంతకంతకూ జగన్ కూరుకుపోతున్నాడని, దాసరి నారాయణరావు పార్థీవ దేహం వద్ద చెప్పిన మాటలు కూడా నిలుస్తున్నాయి. అయితే జగన్ నేరుగా ఈ మాటలు అనకపోయినా… వైసీపీ కీలక నేతలు వ్యాఖ్యానించడంతో… ఆ ప్రభావం పార్టీ మీద, జగన్ మీద తీవ్రంగా పడుతుందని చెప్పక తప్పదు. గత కొంతకాలంగా దాసరి నారాయణరావు వైసీపీ సన్నిహితంగా ఉంటున్నారన్న విషయం జగమెరిగిన సత్యమే.
అప్పటివరకు ఎవరి ఇంటికి వెళ్ళని జగన్, తొలిసారిగా దాసరి ఇంటికి వెళ్ళడం, అదే సమయంలో మరో పక్కన ముద్రగడ పద్మనాభం కాపు రాజకీయాలు చేస్తుండడంతో… కాపు వర్గాలను ఆకట్టుకునేందుకు జగన్ రాజకీయాలు చేస్తున్నారన్న విశ్లేషణలు వెలువడ్డాయి. ఏది ఏమైనా జగన్ – దాసరి సన్నిహితంగా ఉన్నారనేది వాస్తవం. దీనిపై దాసరి స్పందిస్తూ… తాను ఏ పార్టీలోకి వెళ్ళడం లేదని, ఈ వయసులో ఇంకా రాజకీయాలపై మక్కువ లేదని వ్యాఖ్యానించారు. ఇప్పుడే అదే విషయాలు చెప్పడానికి దాసరి లేరు గనుక, వైసీపీ నేతలు చేసిన వ్యాఖ్యలు విమర్శలకు దారి తీస్తున్నాయి.
“దాసరి తమ పార్టీలో చేరి తమ అధినేత జగన్మోహన్రెడ్డిని సీఎం చేస్తానని” ఇటీవలే చెప్పారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు బొత్స సత్యనారాయణ, ఆర్కే రోజా, భూమన కరుణాకర్ రెడ్డి తదితరులు వ్యాఖ్యానించారు. ఓ పక్కన కుటుంబ సభ్యులు, అభిమాన వర్గం దాసరి పార్థీవ దేహాన్ని చూసి రోధిస్తుంటే… మరో పక్కన వైసీపీ నేతలు తమ రాజకీయ లబ్దే లక్ష్యంగా కీలక వ్యాఖ్యలు చేసారు. ఎవరెట్లా పోయినా జగన్ సిఎం కావడమే వైసీపీ నేతల అభిమతంగా ఈ సందర్భంగా నిరూపణ అయ్యింది.
నిజంగా దాసరి ఆ వ్యాఖ్యలు చేసున్నా గానీ… చెప్పడానికి కాస్త సమయం, సందర్భం ఉండాలన్న కనీస నీతి, నియమాలు కూడా సదరు పార్టీ నేతలకు లోపించడం శోచనీయం. అంటే దాసరి తమ వైపే ఉన్నారు కాబట్టి, తద్వారా కాపు వర్గాన్ని తమ పార్టీ వైపుకు తిప్పుకునే క్రమంలో ఈ వ్యాఖ్యలు చేసినట్లుగా విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. దాసరి కాలం చేసిన సెంటిమెంట్ రగులుతోంది గనుక, ఇప్పుడే ప్రజల్లోకి తీసుకువెళితే, మున్ముందు ప్రచారానికి ఉపయోగపడుతుందని భావించారో ఏమో గానీ, ఈ ‘వైసీపీ శవ రాజకీయాలకు’ అంతులేకుండా పోతోందని ప్రజలు చీదరించుకునే పరిస్థితి నెలకొంది.



