తనకు మద్దతు తెలుపుతోన్న నేతల్లో 10 మంది సీనియర్ నేతలతో కలిసి తమిళనాడు గవర్నర్ విద్యాసాగర్ రావుతో అన్నాడీఎంకే జనరల్ సెక్రటరీ శశికళ 20 నిముషాల పాటు భేటీ అయ్యింది. ఎమ్మెల్యేల సంతకాలతో కూడిన మద్దతు లేఖను ఆమె గవర్నర్కు సమర్పించి, ప్రభుత్వం ఏర్పాటుకు అనుమతించాలని విజ్ఞప్తి చేశారు. తనకు మద్దతు ఇస్తున్న వారి జాబితాను గవర్నర్ కు అందజేశారు. అయితే, భేటీ ముగిసిన తర్వాత ఆమె మీడియాతో మాట్లాడకుండానే వెళ్ళిపోగా, ఆమెలో ఓ నిరాశ, టెన్షన్ కనిపించింది.
మరో వైపు సాయంత్రం 5 గంటల సమయంలో గవర్నర్ ను కలిసిన అనంతరం పన్నీర్ సెల్వం ముఖంలో సంతోషం, విజయం సాధించానన్న గర్వం కనిపించగా, శశికళలో మాత్రం నైరాశ్యత కనిపించడంతో అసలు గవర్నర్ ఈ ఇద్దరికీ ఏం చెప్పారా? అన్న ఆసక్తి నెలకొంది. తమిళనాడు రాజకీయాల్లో గవర్నర్ పాత్ర కీలకం కావడం విశేషంగా చెప్పుకోవచ్చు. ఇదిలా ఉంటే, జయలలిత అక్రమాస్తుల కేసులో శశికళ నిందితురాలిగా ఉన్న కేసుకు సంబంధించి సుప్రీంకోర్టు శుక్రవారం నాడు తీర్పు వెలువరిస్తుందనే ఊహాగానాలు వెలువడ్డప్పటికీ, లిస్టింగ్ లో ఈ కేసు నమోదు కాలేదు.
దీంతో ఈ కేసుపై తీర్పు వచ్చే వారంలో వెలువడే అవకాశముందని తెలుస్తోంది. కాగా, ఈ అక్రమాస్తుల కేసులో దివంగత సీఎం జయలలితతో పాటు, ఆమె కుటుంబ సభ్యులను కర్ణాటకలోని దిగువ కోర్టు దోషిగా తేల్చడం, ఈ తీర్పును సవాల్ చేయడంతో కర్ణాటక హైకోర్టు ఈ కేసును కొట్టివేయడం విదితమే. అయితే, ఈ కేసును కొట్టివేయడాన్ని సవాల్ చేస్తూ, కర్ణాటక ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ క్రమంలో జయలలిత మృతి చెందారు. ప్రస్తుతం అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శిగా ఉన్న శశికళ సీఎం పదవికి పోటీ పడుతుండటంతో ఈ కేసుపై మరింత ఆసక్తి పెరిగింది.



