తమిళనాడు రాజకీయాలలోకి ఇప్పటికే విజయ్ టీవీకే పార్టీతో ఎంట్రీ ఇచ్చారు. ఇప్పుడు మరో కొత్త పార్టీ వచ్చింది. అది ఎవరో అయితే చెప్పుకోవాల్సిన అవసరం లేదు. దివంగత ముఖ్యమంత్రి జయలలిత స్నేహితురాలు శశికళ కనుక చెప్పుకోవాల్సి వస్తోంది.
ఆమె ‘ఆల్ ఇండియా పురచ్చి తలైవర్ మక్కల్ మున్నేట్ర కళగం’ పేరుతో కొత్త పార్టీ ఏర్పాటు చేసుకున్నారు. కొబ్బరి చెట్ల సమూహం తన పార్టీ గుర్తుగా ప్రకటించారు.
శుక్రవారం చెన్నైలో ఆమె మీడియాతో మాట్లాడుతూ, “నేను జయలలిత మరణం తర్వాత రాష్ట్రాన్ని, అన్నాడీఎంకే పార్టీని గాడిన పెట్టాలని చాలా ప్రయత్నించాను. కానీ నేను ముఖ్యమంత్రిగా నియమించిన వ్యక్తే నాకు వెన్నుపోటు పొడిచాడు.
ఆ తర్వాత అనేక అనూహ్యమైన సంఘటనలు జరిగాయి. అనేక అపనిందలు, అవమానాలు భరించాను. అయినా పార్టీ శ్రేయస్సు కోరి మౌనంగా ఉండిపోయాను. తొమ్మిదేళ్ళు మౌనం వహించాను.
నా మౌనంతో పార్టీ కార్యకర్తలకు, ప్రజలకు తీరని అన్యాయం జరుగుతోందని గ్రహించాను. వారి కోసం మౌనం వీడి మళ్ళీ రాజకీయాలలోకి వచ్చాను,” అని అన్నారు.
తామందరం ఉమ్మడి కుటుంబంలా కలిసి పనిచేస్తామని చెప్పేందుకుగాను పార్టీ గుర్తుగా కొబ్బరి చెట్ల సమూహాన్ని ఎంచుకున్నానని శశికళ చెప్పారు.
జయలలిత ఆకస్మిక అనారోగ్యం, మరణం తర్వాత శశికళ పార్టీ, ప్రభుత్వ పగ్గాలు చెప్పటేందుకు ప్రయత్నించారు. కానీ అనూహ్యంగా అక్రమాస్తుల కేసులో బెంగళూరు జైల్లో పడ్డారు. నాలుగేళ్ళు జైలు శిక్ష అనుభవించిన తర్వాత మళ్ళీ రాజకీయాలలో ప్రవేశించేందుకు సిద్దమయ్యారు.
కానీ ఏ అదృశ్యశక్తో ఆమె చేత రాజకీయ సన్యాసం చేస్తున్నట్లు ప్రకటింపజేసింది. అప్పటి నుంచి రాజకీయాలకు దూరంగా, మౌనంగా ఉండిపోయారు. మళ్ళీ ఇప్పుడు సడన్ ఎంట్రీ ఇస్తున్నారు. ఆమెను జైలుకి పంపించి, బలవంతంగా రాజకీయ సన్యాసం చేయించిన ఆ అదృశ్యశక్తే ఇప్పుడు ఆమెను బరిలో దించి ఉండవచ్చు.
కనుక కొబ్బరిచెట్ల మాటు నుంచి ఆమె ఎవరిపై బాణం గురిపెట్టబోతున్నారో? ఆమెకు ఈ కొత్త బాణం ఎవరిచ్చారో… ఎందుకిచ్చారో…కాస్త రాజకీయజ్ఞానం ఉన్నవారు ఊహించగలరు.




