తిరుమల శ్రీవారి లడ్డు విషయంలో ఏపీలో మొదలైన రచ్చ తమిళనాడుకు పాకింది. అయితే ఈ లడ్డు విషయంలో తమిళ హీరో కార్తీ, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ మధ్య జరిగిన మాటల సంభాషణలు సారీ తో మొదలై బెస్ట్ అఫ్ లక్ తో ముగిసాయి.
అయితే ఈ వివాదం కు ఇక్కడితో ఎండ్ కార్డు పడినట్లే అని అందరు భావించినప్పటికీ దీనికి కొంతమంది కామాలు పెట్టుకుంటూ సాగదీస్తున్నారు. మొదటగా ప్రకాష్ రాజ్ ఈ వివాదం పై స్పందిస్తూ చేయని తప్పుకి క్షమాపణలు చెప్పించుకోవడం పవన్ కు ఏమాత్రం న్యాయం అంటూ కౌంటర్ వేశారు.
ఇక దీనికి ఇంకాస్త ఆజ్యం పోస్తూ సినీ ప్రముఖుడు, రాజకీయ నేత సీమాన్ కార్తీకి మద్దతుగా పవన్ కు కౌంటర్ గా కొన్ని వ్యాఖ్యలు చేసారు. కార్తీ మాట్లాడిన మాటలలో అసలు క్షమాపణలు చెప్పేంత తప్పేముంది.? సదరు ఆడియో ఫంక్షన్ లో యాంకర్ అడిగిన ప్రశ్నకు కాను కార్తీ ఇప్పుడు లడ్డు మేటర్ వద్దులెండి…ఇది చాల సెన్సిటివ్ ఇష్యూ అంటూ బదులిచ్చారు.
అందులో కార్తీ మాటలను తప్పుపట్టాల్సినంత విషయం ఏముంది అంటూ పవన్ పై మండిపడ్డారు సీమాన్. అయితే ఇప్పుడు కార్తీకి మద్దతుగా వచ్చిన ఈ సోకాల్డ్ మేధావులంతా మరి గత వైసీపీ పాలనలో సూపర్ స్టార్ రజనీకాంత్ ను వైసీపీ నాయకులంతా ఎంత ఘోరంగా దుయ్యబట్టారో వీరి కంటపడలేదా.?
కనీసం ఆయన వయస్సుకు కూడా విలువ నివ్వకుండా రజనీకాంత్ ఆరోగ్యం మీద కూడా హీనంగా మాట్లాడుతూ రజనీకాంత్ ను కించపరిచారు. ఇందులో కొడాలి నాని, రోజా వంటి వారైతే తమ స్థాయికి మించి రజనీకాంత్ మీద వ్యాఖ్యలు చేసారు. మరి ఇప్పుడు తెగ హడావుడి చేస్తున్న ఈ పెద్దమనుషులంతా మరి అప్పుడు వైసీపీ నేతల నోటికి దడిచి బయటకు రాలేకపోయారా.?
రజనీకాంత్ కు జరిగిన అవమానం పై నిలదీయలేకపోయారా.? అంటూ పవన్ అభిమానులు రజనీకాంత్ మీద వైసీపీ నేతలు మాట్లాడిన వీడియోను సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. అప్పుడు రజనీకాంత్ పట్ల వైసీపీ నేతలు చేసిన దిగజారుడు వ్యాఖ్యలను ఖండించి రజనీకాంత్ కు మద్దతు తెలియచేసింది పవన్ కళ్యాణ్ అనే విషయాన్ని గుర్తు చేస్తున్నారు.
అలాగే కార్తీ, పవన్ కు ఒకరిపట్ల ఒకరికి అదే గౌరవ భావం ఉంటుందని, ఈ విషయాన్ని ఇక్కడితో ముగిస్తే అందరికి మంచిదంటూ వాపోతున్నారు జనసైనికులు. ఇక్కడ హీరో కార్తీ కానీ పవన్ కానీ ఈ విషయాన్ని అక్కడితోనే ముగించేశారు. కానీ వీరంతా ఎవరి కోసమో ఈ వివాదాన్ని పెంచి పోషిస్తున్నట్లుగా ఉంది అనే అభిప్రాయం సర్వత్రా వినపడుతుంది.




