తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ పై, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పై బిఆర్ఎస్ నేత మాజీ ఐటీ మంత్రి కేటీఆర్ తన ఆక్రోశాన్ని వెళ్ళకక్కుతున్నారంటూ మంత్రి సీతక్క, ఆ పార్టీ నేత బండ్ల గణేష్ బిఆర్ఎస్ పార్టీ పైన, కేటీఆర్ పైన విమర్శలకు దిగారు.
బిఆర్ఎస్ ఎమ్మెల్యే లు నలుగురు వచ్చి ముఖ్యమంత్రిని కలవగానే ఎందుకు అంతలా కంగారుపడిపోతున్నారు సార్…, గతంలో మీరు చేసిన పనులేమన్న గుర్తొచ్చాయి అంటూ బండ్ల తన స్టైల్ లో కేటీఆర్ కు కౌంటర్ వేశారు. తెరాస గా తెలంగాణలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి పాలన మొదలుపెట్టిన మీరు ఒక్కొక్కరిగా ప్రతిపక్ష పార్టీల నేతలను అభివృద్ధి పేరుతో తమ పార్టీలోకి ఆహ్వానించలేదా..?
అలాగే వారికీ మీ పార్టీ కండువా కప్పలేదా..? రాష్ట్రంలో ప్రతిపక్షమనేదే లేకుండా చేయడానికి ప్రయత్నించలేదా..? పార్టీలకు పార్టీలనే కాళీ చేసి ఆ పార్టీ నేతలను తెరాస కారెక్కించలేదా..? ‘నీవు నేర్పిన విధ్యే గా నీరజాక్షా’ అన్నట్లు ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్న మీ పార్టీ నేతలు అధికార పక్షంలో ఉన్న మా నాయకుడిని కలిస్తే మీకు గతం గుర్తుకు వచ్చి కంగారు పుడుతుందా..? అంటూ కేటీఆర్ పై విరుచుకుపడ్డారు సీతక్క, బండ్ల గణేష్.
ప్రతిపక్షములో ఉన్నప్పటికీ వారికీ అహంకారం తగ్గలేదని అందుకే ప్రజాస్వామ్య బద్దంగా ఎన్నికైన ప్రభుత్వాన్ని కూల్చేస్తాం, మళ్ళీ కేసీఆర్ ను ముఖ్యమంత్రిని చేసేస్తాం అంటూ అహంభావంతో రెచ్చిపోతున్నారంటూ, చేతిలో అధికారం, పదవులు లేకపోతే కేసీఆర్ కుటుంబం ఉండలేకపోతుందంటూ వ్యాఖ్యానించారు సీతక్క.అధికారంలో ఉన్నప్పుడు “గెలిచిన ప్రతిపక్ష పార్టీ నేతలను లాక్కున్నారు”, ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు “గెలిచిన అధికార పార్టీని కూలుస్తాం” అంటూ బెదిరిస్తున్నారు. కూల్చడం, లాక్కోవడం ఇదే వారి నైజం అంటూ కేటీఆర్ పై మండిపడ్డారు మంత్రి.
అలాగే తెరాస ను బిఆర్ఎస్ గా మార్చిన కేసీఆర్ పార్టీ ఇప్పుడు భారతీయ సమితి అయ్యింది కాబట్టి దేశంలో ఎక్కడికైనా వెళ్ళి కేసీఆర్ ను ముఖ్యమంత్రిని చేసుకోవచ్చు. అంతెందుకు పక్క రాష్ట్రమైన ఏపీలో, మహారాష్ట్ర లో కొన్ని రోజులలో ఎన్నికలు జరుగుతున్నాయి అక్కడికి వెళ్ళి మీ ప్రయత్నాలు మొదలుపెట్టొచ్చుగా అంటూ కేటీఆర్ కు ఉచిత సలహాలు ఇస్తున్నారు బండ్ల గణేష్. అంతే సార్..,”అధికారం లేకపోతే అధికార పార్టీ కార్యకర్త కూడా ప్రతిపక్ష పార్టీ అధినేతకు సలహాలిస్తుంటారని” బండ్ల గణేష్ మాటలతో అర్ధమయ్యింది.




