ఒక పతనానికి…ఒక పొత్తుకు పునాది..!

Chandrababu Naidu Jagan

సెప్టెంబర్ 9 2023 అటు టీడీపీ చరిత్రలోనే కాదు ఇటు వైసీపీ రాజకీయ జీవితంలోను ఇది ఒక చీకటి రోజునే చెప్పాలి. నాలుగున్నర దశబ్దాల తన రాజకీయ జీవితంలో ఎన్నడూ ఊహించని, ఎదురవ్వని పరిస్థితులను బాబు ఎదుర్కోవాల్సి వచ్చింది. అలాగే భవిష్యత్ పరిణామాలు ఉహించకుండా ఒక అనాలోచిత చర్యకు పాల్పడితే జరిగి విధ్వంసానికి జగన్ పునాది వేసుకున్న రోజు.

సరిగ్గా ఏడాది కిందట ఎటువంటి ఆరోపణలు లేవు, ఎటువంటి సాక్ష్యాలు చూపలేదు, ఎటువంటి ముందస్తు నోటీసులు ఇవ్వలేదు… రాత్రికి రాత్రే ఉన్న పళంగా నంద్యాల పర్యటనలో ఉన్న చంద్రబాబు ని అరెస్టు చేసి పైశాచిక ఆనందాన్ని అనుభవించారు వైసీపీ నేతలు.

ADVERTISEMENT

జగన్ లండన్ వెళ్లడం, బాబు జైలుకెళ్లడం ఏకకాలంలో జరిగిపోయాయి. ఈ చర్యతో రెండు తెలుగు రాష్ట్రాల రాజకీయ ముఖ్య చిత్రం ఒక్కసారిగా మారిపోయింది. దాని ఫలితం అధికార పక్షాలు విపక్షాలయ్యాయి, విప క్షా లు అధికార పక్షాలుగా మారాయి. యాదృచ్ఛికమో ఏమో కానీ సరిగ్గా ఏడాది తరువాత కూడా ఇదే నెలలో జగన్ మాజీ ముఖ్యమంత్రి హోదాలో మళ్ళీ లండన్ పర్యటనకు సిద్ధమయ్యారు.

అయితే 151 సీట్లతో అధికారం చేతిలో ఉంది కదా అన్న అహంకారంతో ఆనాడు జగన్ తీసుకున్న ఒక్క నిర్ణయం ఈనాడు వైసీపీ ని 11 స్థానాలకు పరిమితం చేసి ముఖ్యమంత్రిగా ఉన్న జగన్ ను కనీసం ప్రతిపక్ష నేతగా కూడా గుర్తించకుండా ఒక సాధారణ ఎమ్మెల్యే స్థాయికి తీసుకు వచ్చింది.

జగన్ తీసుకున్న అనాలోచిత నిర్ణయం వైసీపీ సమాధికి పునాది వేసింది. బాబు అరెస్టుతో ఇటు ఏపీ అటు తెలంగాణలో నిరసనలు మిన్నంటాయి. ప్రజలు ఎక్కడిక్కడ స్వచ్ఛందంగా బయటకు వచ్చి బాబు కుటుంబానికి, టీడీపీ పార్టీకి మద్దతు తెలియచేసారు. కేవలం తన అహం చల్లార్చుకోవడనికి మాత్రమే జగన్, బాబు ని అరెస్టు చేపించారు అనే నిర్ణయానికి బలం పెరిగింది.

నాడు టీడీపీ మీద విరుచుకుపడిన నేతలందరూ, బాబు పై అసత్య ప్రచారాలకు పురికొల్పిన నాయకులందరూ నేడు ఇంట్లో కూర్చొని రోజులు లెక్కబెడుతున్నారు. బాబు అరెస్టుతో అటు బిఆర్ఎస్ పాక్షికంగా నష్టపోతే కాంగ్రెస్ కు అనుకోని మద్దతు దొరికింది.

బాబు అరెస్టుతో అటు టీడీపీ పార్టీని భూస్థాపితం చేసేసి, తిరిగి రాష్ట్రంలో మళ్ళీ అధికారాన్ని చేజిక్కించుకోవాలి అని కలలు కన్న జగన్ కు అవి ఎప్పటికి పగటికలలే అవుతాయి అంటూ బాబుకి మద్దతుగా ముందుకొచ్చారు జనసేన అధినేత పవన్. ఒక విజనరీ నాయకుడిని అన్యాయంగా అరెస్టు చేసి వైసీపీ జైలుకు పంపించింది అనే భావనలో ఉన్న పవన్, బాబు కి తన మద్దతు ప్రకటించి టీడీపీ, జనసేన పొత్తుకు శ్రీకారం చుట్టారు.

ఆ తరువాత జరిగిన పరిణామలన్నీ వైసీపీ పార్టీకి ఓటమి భయాన్ని రుచి చూపించాయి. రాజకీయ విశ్లేషకులు, ప్రజాస్వామ్య వాదులు జగన్ నిర్ణయాన్ని తప్పుబడుతూ జగన్ తన గోతిని తానే తీసుకుంటు వైసీపీ కి రాజకీయ సమాధి కట్టుకుంటున్నారు అని హెచ్చరిస్తున్న అటువంటి వారి మాటలను కూడా పెడచెవిన పెట్టారు జగన్.

అయితే ఇప్పుడు వాటి తాలూకా ఫలితాలను అనుభవిస్తూ కూడా ఈ 5 ఏళ్ళు కళ్ళు మూసుకుంటే సరిపోతుంది అంటూ ఇప్పటికి చేసిన తప్పేంటో కళ్ళు తెరిచి చూసే పరిస్థితులలో జగన్ లేకపోవడం ఆయన నియంతృత్వానికి అద్దం పడుతుంది. బాబు అరెస్టు అంటూ జగన్ తీసుకున్న నిర్ణయం వైసీపీ పతనానికి, టీడీపీ, జనసేన పొత్తుకు పునాది వేసింది.

ఇప్పుడు వైసీపీ అనుభవిస్తున్న ఈ దుస్థితికి స్వయంగా ఆ పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డి నియంత పాలనే కారణమనేది జగమెరిగిన సత్యమే. వైసీపీ నేతలు సైతం ఒప్పుకున్న వాస్తవమే.

సెప్టెంబర్, 9, 2023 జగన్ ముఖ్యమంత్రిగా, చంద్రబాబు ఒక ప్రతిపక్ష నేతగా, పవన్ ఒక పార్టీ అధినేతగా ఉన్నారు. అయితే ఈ సెప్టెంబర్, 9, 2024 చంద్రబాబు ముఖ్యమంత్రిగా, పవన్ డిప్యూటీ సీఎం గా, 5 శాఖలకు మంత్రిగా ఉన్నారు. కానీ జగన్ ఒక పులివెందుల ఎమ్మెల్యే గా మిగిలిపోయి కనీసం అసెంబ్లీకి కూడా రాలేని పరిస్థితులలో ఉన్నారు.

ADVERTISEMENT
Latest Stories