రాష్ట్ర వ్యాప్తంగా దళితవాడలలో ఆలయాలు నిర్మించాలనే తితిదే తాజా ప్రతిపాదనపై ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తీవ్ర అభ్యంతరం చెప్పారు. ఇందుకు రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఆమె వైఖరిని తప్పు పడుతూ తీవ్ర విమర్శలు చేశారు.
అసలు తితిదే దళితవాడల్లో ఆలయాలు నిర్మించాలనుకుంది? వీటిపై షర్మిలకు అభ్యంతరం దేనికి? అసలు ఈ అంశంపై ఇంత రాద్దాంతం ఎందుకు జరుగుతోంది?అనే సందేహాలకు మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి మాటల్లోనే జవాబులు లభించాయి.
గత ప్రభుత్వ హయంలో రాష్ట్రంలో పెద్ద ఎత్తున మత మార్పిడులు జరిగాయి. వారిలో నిరుపేద బడుగు బలహీన వర్గాలవారు… ముఖ్యంగా దళితులే ఎక్కువ. నేటికీ వారు ఆర్ధికంగా, సామాజికంగా అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు.
కానీ వారిని హిందూ సమాజం, ప్రభుత్వాలు పట్టించుకోలేదు. కనుక తమకు ఆర్ధిక సాయం, సముచిత గౌరవం ఇస్తున్న క్రీస్టియన్ మతంలోకి మారారు. నేటికీ మారుతూనే ఉన్నారు.
ఈ మత మార్పిడులు సహజంగానే బీజేపికి అసహనం కలిగిస్తాయి. కనుక వీటిని అడ్డుకోవడానికి లేదా తగ్గించడానికి తితిదే ద్వారా ఈ ప్రతిపాదన తెరపైకి తెచ్చి ఉండవచ్చు.
క్రీస్టియన్ మతస్థురాలైన షర్మిలకు ఈ విషయం అర్దమైంది. కనుకనే కాంగ్రెస్ పార్టీ… సెక్యులిరిజం పేరుతో దళితవాడలలో ఆలయాలు నిర్మించకుండా అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని మంత్రి ఆనం మాటలతో స్పష్టమైంది.
అయితే దళితులు ఆర్ధిక, సామాజిక సమస్యల కారణంగానే మత మార్పిడికి సిద్దపడుతున్నారని తెలిసి ఉన్నప్పుడు ప్రభుత్వం వారి సమస్యల పరిష్కారానికి గట్టిగా కృషి చేయాలి. ముఖ్యంగా వారికి విద్య, ఉద్యోగాలు, ఉపాధి, ఆరోగ్యం, వైద్యం, ఇళ్ళు వంటివి అందించాలి. కానీ రిజర్వేషన్స్, సంక్షేమ పధకాలతో సరిపెడుతున్నాయి.
వారికి సంక్షేమ పధకాలు అందుతున్నప్పటికీ, వాటితో వారి జీవన ప్రమాణాలు ఏమాత్రం మారవు. కేవలం బ్రతకడానికి మాత్రమే సరిపోతాయి. కనుక మత మార్పిడికి సిద్దపడుతున్నారు. కానీ మతం మారినా వారి పరిస్థితిలో పెద్దగా మార్పు రావడం లేదని వారికీ తెలుసు… ప్రభుత్వానికీ తెలుసు.
కనుక ప్రభుత్వం కూడా ఈ సమస్య తీవ్రతని అర్ధం చేసుకుని తగు చర్యలు చేపట్టే బదులు దళితవాడలలో ఆలయాలు నిర్మిస్తే మత మార్పిడులు తగ్గుతాయని భావిస్తున్నట్లు ఉంది. ఈ ప్రతిపాదన ఎలా ఉందంటే కాలికి దెబ్బ తగిలితే చేతికి కట్టు కట్టుకున్నట్లే ఉంది!





