ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో దత్తపుత్రుడు అనగానే సామాన్యుడికి కూడా గుర్తొచ్చే పేరు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. ఆ రకంగా వైసీపీ పవన్ పై విష ప్రచారం చేసింది, ఇప్పటికి చేస్తుంది కూడా. బాబు దత్తపుత్రుడు పవన్ అంటూ వైసీపీ అధినేత వైఎస్ జగన్ నుంచి ఆ పార్టీ లీడర్లు, క్యాడర్ పవన్ పై విమర్శల దాడి చేస్తారు.
అయితే ఆ దాడికి ప్రతిగా పవన్ తన మంగళగిరి పార్టీ కార్యాలయంలో ఒకసారి వైసీపీ నేతల పై అనుచిత వ్యాఖ్యలతో విరుచుకుపడ్డారు. అయినా కానీ వైసీపీ రాజకీయంలో ఎటువంటి మార్పు కనిపించలేదు, ఇక కనిపిస్తుంది అన్న ఆశ కూడా జనసేన కు లేదు.
ఈ నేపథ్యంలో ఇప్పుడు షర్మిల వ్యాఖ్యలతో ఏపీ రాజకీయాలలోకి మరో దత్తపుత్రుడు అడుగు పెట్టినట్టయ్యింది. ఆయనే వైసీపీ అధినేత వైస్ జగన్ మోహన్ రెడ్డి. అయితే పవన్, బాబుకి దత్తపుత్రుడు అంటూ వైసీపీ ప్రచారం చేస్తుంటే జగన్, బీజేపీ కి దత్తపుత్రుడు అంటూ చెల్లి షర్మిల వాదిస్తుంది.
అయితే ఆమె ఈ ఆరోపణలకు ఆధారాలు కూడా చూపిస్తున్నారు. జగన్ ముఖ్యమంత్రి అయ్యిన నాటి నుంచి నేటి వరకు కూడా బీజేపీ కి దత్తపుత్రుడుగా మారిపోయారని, బీజేపీ పార్లమెంట్ లో ప్రవేశ పెట్టే ప్రతి బిల్లుకి వైసీపీ తరుపున జగన్ బేషరతు మద్దతు ప్రకటిస్తూ బీజేపీ ప్రభుత్వానికి అండగా నిలుస్తున్నారన్నారు.
2024 ఎన్నికలలో ఈవీఎం ల టాంపరింగ్ వల్లనే కూటమి అధికారంలోకి వచ్చింది అంటూ పదేపదే ఆరోపిస్తున్న వైసీపీ ఇప్పుడు తనకు చిత్తశుద్ధి ఉంటే ఆ ఎన్నికల కమిషనర్ ను తొలగించేందుకు కాంగ్రెస్ ఇస్తున్న నోటీసులకు మద్దతు ఇవ్వాలని డిమాండ్ చేసారు.
మరి వైసీపీ ఓటమికి కూటమి గెలుపు కి ఈవీఎం లే కారణం అంటూ బీద ఏడ్పులు ఏడ్చే వైసీపీ ఇందుకు ముందుకొస్తుందా.? లేదా తనకు బీజేపీతో ఉన్న అక్రమ పొత్తు కోసం వెనక్కి వెళుతుందా.? అంటూ జగన్ పై విరుచుకుపడ్డారు షర్మిల.
అయితే ఇన్నాళ్లు పవన్ ని దత్తపుత్రుడు అంటూ రెచ్చిపోయిన జగన్ ఇప్పుడు అదే దత్తపుత్రుడు అనే ఆరోపణలు ఎదుర్కొంటు చెల్లి షర్మిల ముందు, యావత్ ఏపీ ప్రజల ముందు దోషిగా నిలబడ్డారు.
మరి వైసీపీ షర్మిల విమర్శల పై స్పందిస్తూ తన చిత్తశుద్ధిని ప్రకటించుకునేందుకు ఎన్నికల కమిషనర్ కి ఇచ్చే నోటీసులకు సహకరిస్తూ తన ఈవీఎం ల ట్యాపరింగ్ ఆరోపణలకు కట్టుబడుతుందా.? లేదా చెల్లి షర్మిల ఆరోపించినట్టుగా సైలెంట్ గా ఉంటూ జగన్ బీజేపీ కి దత్తపుత్రుడే అని మరోమారు నిరూపించుకుంటుందా.?




