తెలుగుదేశం పార్టీలో తనకు కనీస గౌరవం కూడా దక్కడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తూ… 14వ తేదీన వైసీపీ జెండా పట్టుకోబోతున్నానని కర్నూలు జిల్లా నేత శిల్పా మోహన్ రెడ్డి ఇప్పటికే ప్రకటించారు. టిడిపికి మూడేళ్ళ పాటు నిస్వార్ధ సేవ చేశానని… ఆ పార్టీకి భవిష్యత్తు లేదనే ఉద్దేశంతోనే వైసీపీలో చేరుతున్నానని, పార్టీ మారడం వెనుక ఎలాంటి ఒప్పందం లేదని అన్నారు. భూమా నాగిరెడ్డిని పార్టీలోకి చేర్చుకున్నప్పుడు కూడా తాను సర్దుకుపోయానని చెప్పిన శిల్పా, తనకున్న ఇబ్బందులను పార్టీ అధినేత చంద్రబాబు దృష్టికి తాను తీసుకెళ్లినప్పటికీ, పట్టించుకోలేదని, అందుకే పార్టీ మారుతున్నట్లుగా ప్రకటించుకున్నారు.
అయితే పార్టీ మార్పు వెనుక అసలు ఉద్దేశం రాజకీయ వర్గాలకు తెలిసిందే. భూమా నాగిరెడ్డి మరణం తర్వాత ఏర్పడిన నంద్యాల స్థానంలో తాను బరిలోకి దిగాలన్న ఆశలు అడియాశలు కావడంతో, అదే సీటును వైసీపీ ద్వారా పోటీ చేయడానికి శిల్పా ఒప్పందం కుదుర్చుకున్నట్లుగా తెలుస్తోంది. శిల్పా వైసీపీ జెండా కప్పుకోగానే, తనను నంద్యాల స్థానం నుండి బరిలోకి దింపుతున్నట్లుగా స్వయంగా జగన్ ప్రకటన చేస్తారనే ఉద్దేశంతో శిల్పా ఉన్నట్లుగా తెలుస్తోంది. నంద్యాల ఎన్నికలపై అతి త్వరలో ఎలక్షన్ కమిషన్ నుంచి నోటిఫికేషన్ కూడా వెలువడే అవకాశాలు ఉన్నాయి.
అయితే ఇప్పటివరకు తెలుగుదేశం పార్టీలో చిచ్చు రాజేసిన నంద్యాల ఉప ఎన్నిక సీటు గొడవ, శిల్పా చేరికతో వైసీపీకి షిఫ్ట్ అయ్యింది. శిల్పా మోహన్ రెడ్డి నంద్యాల వైసీపీ టికెట్ తనదే అంటూ బహిరంగ ప్రకటనలు చేస్తుండటంతో, వైసీపీలో అంతర్గత పోరు మొదలైంది. నియోజక వర్గంలో వైసీపీని బలోపేతం చేసుకోవడానికి పార్టీలోకి ఎవరు వచ్చినా చేర్చుకుంటామని నియోజకవర్గ ఇన్ ఛార్జ్ రాజగోపాల్ రెడ్డి అన్నారు. అయితే, ఉప ఎన్నికలో టికెట్ తనదే అంటూ మోహన్ రెడ్డి చెప్పుకుంటున్నారని… టికెట్ ఇస్తానని జగన్ ఆయనకు ఏమైనా చెప్పారా? అని ప్రశ్నించారు.
నంద్యాల టికెట్ తనకే అని జగన్ ముందు నుంచి చెబుతూ వస్తున్నారని… ఇదే విషయాన్ని జగన్ కు కూడా మళ్లీ చెబుతానని అన్నారు. వైయస్ కుటుంబంతో తనకు 30 ఏళ్ల నుంచి అనుబంధం ఉందని, నంద్యాల టికెట్ తనదేనని, జగన్ తనకు అన్యాయం చేయరని చెప్పడంతో నంద్యాల ఉప ఎన్నిక సీటుపై రాజగోపాల్ రెడ్డి ఎన్ని ఆశలు పెట్టుకున్నారో చెప్పకనే చెప్పారు. దీంతో జగన్ నోట నుండి ఎవరి పేరు వస్తుందోనని పార్టీ వర్గాలు ఎదురు చూస్తున్నాయి. శిల్పాకు పేరు ప్రకటిస్తే రాజగోపాల్ రెడ్డికి… అలాగే రాజగోపాల్ పేరు ప్రకటిస్తే… వచ్చి రావడంతోనే శిల్పాకు జగన్ భారీ షాక్ ఇవ్వడం ఖాయమన్న మాట.



