తెలంగాణలోని అధికార టిఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంపై దర్యాప్తు జరుపుతున్న సిట్ ప్రత్యేక పోలీస్ బృందం ఏపీ వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణరాజుకి నోటీస్ పంపింది. తనకు నోటీస్ అందిందని ఆయన స్వయంగా ధృవీకరిస్తూ “ఈ నెల 29వ తేదీ ఉదయం 10.30 గంటలకు హైదరాబాద్లో తమ కార్యాలయంలో విచారణకు హాజరుకావాలని నోటీసులో కోరారు. నేను తప్పకుండా విచారణకు హాజరయ్యి నాకు తెలిసిన అన్ని విషయాలు చెపుతాను. నేను తెలంగాణ సిఎం కేసీఆర్ని కలలో కూడా వ్యతిరేకించలేదు. ఆయన ప్రభుత్వానికి కీడు తలపెట్టలేదు. నిజానికి కేసీఆర్ చాలా సమర్ధుడైన ముఖ్యమంత్రి. ఆయన నేతృత్వంలో తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాలలో చాలా అభివృద్ధి చెందుతోందని నేను గతంలో కూడా చాలాసార్లు చెప్పాను. ఆయన ముందు ఏపీ సిఎం జగన్మోహన్ రెడ్డి దిగదుడుపే అని చెప్పకతప్పదు.
జగన్మోహన్ రెడ్డిపై 32 కేసులున్నాయి. కానీ ఆయనతో ఆ పార్టీకి చెందిన 151 మంది ఎమ్మెల్యేలతో సహా మంత్రులు, అధికారులు, పలువురు ప్రముఖులు ఫోటోలు దిగుతుంటారు. అంతమాత్రన్న వారందరూ కూడా నేరస్తులవరు కదా?అలాగే ప్రజా జీవితంలో ఉన్న నాతో కూడా పలువురు ఫోటోలు దిగుతుంటారు. వారిలో చాలామంది నాకు తెలియరు కూడా. సాక్షి మీడియాలో నేను టిఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలుకి వంద కోట్లు ఇస్తున్నట్లు దుష్ప్రచారం చేస్తోంది. అదంతా అబద్దం. ఆంధ్రాకు చెందిన హైదరాబాద్లో స్థిరపడిన లక్షలాదిమందిలో నేనూ ఒకడిని మాత్రమే,” అని అన్నారు.
ఏది ఏమైనప్పటికీ ఈ కేసులో రఘురామకి సిట్ నోటీసు పంపించడం కొత్త అనుమానాలకి తావిస్తోంది. ఆయనని ఆంధ్రప్రదేశ్ రప్పించి మరోసారి తమ తడాఖా చూపించాలని జగన్ ప్రభుత్వం ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ ఆయన ఏపీ సీఐడీ పోలీసులకు దొరకకుండా తప్పించుకొని తిరుగుతున్నారు. తెలంగాణ మంత్రులతో ఏపీ మంత్రులలో చాలా మందికి సత్సంబంధాలు ఉన్నాయి కనుక వారితో మాట్లాడి ఈ కేసులో రఘురామ కృష్ణరాజు పేరుని కూడా చేర్పించి ఉన్నా ఆశ్చర్యం లేదు. కనుక 29న విచారణకు హాజరైతే తప్ప అసలు విషయం బయటపడదు.



