ప్రధాని నరేంద్రమోడీ మరికొద్ది సేపటిలో విశాఖకు చేరుకోబోతున్నారు. కనుక ప్రధానికి ఘనంగా స్వాగతం పలికేందుకు బిజెపి నేతలు విమానాశ్రయం నుంచి దారి పొడవునా పార్టీ జెండాలు, బ్యానర్లు కట్టుకొన్నారు. అయితే ప్రధాని పర్యటనను జగన్ ప్రభుత్వం హైజాక్ చేసిందని ఏపీ బిజెపి అధ్యక్షుడు సోమూ వీర్రాజు ముందే చెప్పేశారు. కనుక వైసీపీ నేతలు కూడా ప్రధాని మోడీకి స్వాగతం పలుకుతూ తమ పార్టీ జెండాలు, బ్యానర్లు కట్టుకోవాలనుకొన్నారు. వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు తలుచుకొంటే అదెంత పని?
జీవిఎంసీ అధికారులు ఉరుకుల పరుగుల మీద వచ్చి బిజెపి జెండాలను పీకేయడం మొదలుపెట్టారు. ఆ సమయంలో అక్కడే ఉన్న ఏపీ బిజెపి అధ్యక్షుడు సోమూ వీర్రాజు ‘మా పార్టీ జెండాలనే పీకేస్తారా?’అంటూ వారిపై విరుచుకుపడ్డారు. అయినా వారు ‘కమీషనర్ గారు చెప్పారు. మీ జెండాలు తీసేయాల్సిందే…’ అంటూ బిజెపి జెండాలు పీకేసి వ్యానులో పడేశారు. దాంతో సోమూ వీర్రాజు మరింత ఆవేశంతో వారి మీద కలబడిపోయి వారి చేతుల్లో నుంచి జెండాలు లాక్కొనే ప్రయత్నం చేశారు. ‘ఏదీ మీ కమీషనర్ నంబర్ ఇవ్వండి… ఆయనతో నేనే మాట్లాడుతాను… మా జెండాలు పీకారంటే ఊరుకొనేది లేదు జాగ్రత్త…’ అంటూ వ్యానులో పడేసిన బిజెపి జెండాలను తీసి మళ్ళీ పక్కన పెట్టారు. ‘ప్రధాన మంత్రి నగరానికి వస్తుంటే మేము మా జెండాలు కట్టుకోవడానికి వీల్లేదంటారా?’ అంటూ కాసేపు అధికారులతో వాగ్వాదాలు చేశాక చివరికి వారు ఆ జెండాలు అక్కడ పడేసి వెళ్ళిపోయారు. ఇదీ… ఏపీ బిజెపి పరిస్థితి… ఏపీ బిజెపి అధ్యక్షుడు సోమూ వీర్రాజు పరిస్థితీ!
ఏపీలో వైసీపీ చాలా బలంగా ఉందనే సంగతి అందరికీ తెలుసు కానీ బిజెపి నేతలనీ, వారి పార్టీ జెండాలను ఖాతరు చేయని స్థితిలో ఉందంటే అందుకు వైసీపీని తప్పు పట్టి ప్రయోజనం లేదు. ఏపీ బిజెపి నేతల అసమర్దత, నిర్లిప్తతలే కారణమని చెప్పవచ్చు. జగన్ ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికి వచ్చిన ప్రతీ చిన్న అవకాశాన్ని టిడిపి, జనసేనలు ఉపయోగించుకొని ప్రభుత్వంతో పోరాడుతుంటే, కేంద్రం ప్రభుత్వం తమ వెనుకే ఉన్నా కూడా ఏపీ బిజెపి నేతలు జగన్ ప్రభుత్వాన్ని ప్రశ్నించే సాహసం చేయలేకపోతున్నారు.
అందుకే వైసీపీకి వారు ఇంత లోకువైపోయారని చెప్పక తప్పదు. ఇక వైసీపీ కూడా రాష్ట్రంలో బిజెపిని అసలు పట్టించుకోదు. కానీ ప్రధాని నరేంద్రమోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాలను ప్రసన్నం చేసుకోవడానికి ఎంత దూరమైనా వెళుతుంది. అందుకు ప్రత్యక్ష నిదర్శనమే ప్రధాని విశాఖ పర్యటనకు అది చేస్తున్న ఈ హడావుడి. వైసీపీ రాజకీయంగా తెలివిగా పావులు కదుపుతుంటే, ఏపీ బిజెపి నేతలు కనీసం తమ ఉనికిని చాటుకోలేకపోతున్నారు. కేవలం మోడీ నామస్మరణతో ఏపీలో బిజెపి అధికారంలోకి వచ్చేస్తుందనే గుడ్డి భ్రమలో ఉన్నారు. కనుక ఇటువంటి అవమానాలు భరించక తప్పదు.



