ఎస్.ఎస్.కాంచీ దర్శకత్వంలో రామ రీల్స్ పతాకంపై తెరకెక్కించిన ‘షో టైమ్’ సినిమా ఆడియో విడుదల కార్యక్రమానికి హాజరైన దర్శకధీరుడు రాజమౌళి, తన కజిన్ కాంచీ గురించి పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు. రాజమౌళి దర్శకత్వంలో విడుదలైన ‘మర్యాద రామన్న’ సినిమాతో పాటు ‘ఈగ’ చిత్రానికి కాంచీ రచయితగా పని చేసిన విషయం తెలిసిందే.
తాము తొమ్మిది మంది కజిన్స్ అని, అందులో తనకు అన్నయ్య కాంచీ ఒకరని, ఆయన ఎప్పుడూ వెటకారంగా మాట్లాడతారని, ఆయన మాట్లాడే ప్రతి మాట వెనుక ఖచ్చితంగా అది ఉంటుందని రాజమౌళి అన్నారు. నిజానికి కాంచీ ఎప్పుడో దర్శకుడు కావాలని, కానీ ఎంతో ఆలస్యం అయిందని, అందిరిలోనూ తప్పులు చూపించే మనస్తత్వమని చెప్పిన జక్కన్న… కాంచీ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో తప్పులు ఉండకూడదని తాను కోరుకుంటున్నట్లు పేర్కొన్నారు.
ఈ సినిమా ట్రైలర్ ఎంతో అద్భుతంగా ఉందని, ఈ ట్రైలర్ చూసిన ప్రతి ఒక్కరు ఈ చిత్రాన్ని చూడాలనుకుంటారని అన్నారు. ఈ సినిమాకు కీరవాణి అందించిన సంగీతం గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదని, ఈ చిత్రంలో తన తనయుడు కార్తికేయ పాట పాడాడని, అతను ఇంత చక్కగా పాడతాడని తనకు తెలియదని పుత్రోత్సహాన్ని ప్రదర్శించారు జక్కన్న.



